యా హజ్రత్ హుస్సేన్, యా హజ్రత్ హసన్ అంటూ షియా వర్గీయులు పూర్వీకుల ప్రాణత్యాగాలను స్మరించుకున్నారు. సంతాపదినాలలో భాగంగా భక్తిశ్రద్ధలతో అంబారీపై పీర్లను ఊరేగించారు. అడుగడుగునా దట్టీలు సమర్పించి, రక్తం చిందించారు. యాకుత్పుర బీబీకా అలవా నుంచి చాదర్ఘాట్ వరకు మొహర్రం ర్యాలీ భారీ బందోబస్తు మధ్య భక్తిశ్రద్ధలతో సాగింది. హోంమంత్రి మహమూద్ అలీ బీఆర్ఎస్ నాయకులతో కలిసి బీబీకా అలవాను సందర్శించి దట్టీ సమర్పించారు.
చార్మినార్, జూలై 29 : యా హజ్రత్హుస్సేన్, యా హజ్రత్ హసన్అంటూ షియా వర్గీయులు తమ రక్తాన్ని చిందిస్తూ వారి కోసం ప్రాణాలను తృణపాయంగా అర్పించిన పూరీకులకు నివాళులర్పించారు. మొహర్రం మాసంలోని పదో రోజున షియా వర్గీయులు మాతం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కర్బలా మైదానంలో నాడు జరిగిన సామూహిక ప్రాణత్యాగాలు చేసిన హసన్, హుస్సేన్ల ప్రతిమలకు పది రోజుల పాటు సంతాప దినాలను నిర్వహించిన షియా వర్గీయులు పదోరోజున (పీర్లు) వారి ప్రతిమలను అంబారీపై ఊరేగించారు.
పరిఢవిల్లిన భక్తిభావం..
తమ వర్గీయులను యుద్ధ భూమిలో రక్షించుకునేందుకు హసన్, హుస్సేన్ తన కుటుంబ సభ్యుల ప్రాణాలను సైతం తృణప్రాయంగా వదిలేయడాన్ని స్మరించుకుంటూ షియా వర్గీయులు తమ శరీరాలకు గాయం చేసుకుంటూ రక్తాన్ని చిందించారు. యాకుత్పుర బీబీకా అలవా నుంచి ప్రారంభమైన మొహర్రం ర్యాలీ ఎత్తేబార్ చౌక్, కోట్ల అలిజా, చార్మినార్, గుల్జర్హౌస్, పంజేషా, మీర్ ఆలం మండి, దారుల్షిఫా మీదుగా చాదర్ఘాట్ వరకు కొనసాగింది. అంబారీ ముందు వేలాది షియా వర్గీయులు మాతం నిర్వహిస్తూ ముందుకు కదిలారు.
అడుగడుగునా దట్టీలు..
మొహర్రం ర్యాలీ పొడవునా అనేక మంది భక్తులు, వివిధ విభాగాల అధికారులు, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్తోపాటు ఇతర విభాగాల అధికారులు హసన్, హుస్సేన్లకు అత్యంత ప్రీతిపాత్రమైన దట్టీలను అందించి ఆశీర్వచనాలను అందుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ చార్మినార్ సమీపంలోని పోలీస్స్టేషన్కు ఎదురుగా ఏర్పాటు చేసిన వేదిక పై నుంచి దట్టీలు సమర్పించారు. అలాగే మీర్ఆలం మండి ప్రాంతంలో ఏర్పాటు చేసిన వేదిక నుంచి వివిధ పార్టీల నాయకులు, అధికారులు దట్టీలు అందించారు.
పటిష్ట బందోబస్తు…
మొహర్రం సంతాప దినాలను పురస్కరించుకొని పాతనగరంలోని వివిధ ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని దక్షిణ మండల డీసీపీ సాయిచైతన్య తెలిపారు. బీబీకా అలవా నుంచి ర్యాలీ ముగిసే చాదర్ఘాట్ వరకు దారి పొడవునా టాస్క్ఫోర్స్, నగర ప్రత్యేక పోలీస్ బలగాలతో బందోబస్తు నిర్వహించామని డీసీపీ పేర్కొన్నారు.
దట్టీలు సమర్పించిన హోంమంత్రి…
శనివారం ఉదయం బీబీకా అలవాను రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ బీఆర్ఎస్ నాయకులతో కలిసి సందర్శించారు. ఆలంలకు దట్టీలను సమర్పించిన హోంమంత్రి మాట్లాడుతూ.. సంతాప దినాల్లో నిర్వహించే ర్యాలీ కోసం ప్రభుత్వం అన్ని పటిష్ట చర్యలు చేపట్టిందన్నారు. ర్యాలీ నిర్వహణ కోసం వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్బోర్డు చైర్మన్ మసీఉల్లా, బీఆర్ఎస్ నాయకులు ఇనాయత్ అలీ బాఖ్రీ తదితరులు పాల్గొన్నారు.