చిట్టి బుర్రలు తమ ఆలోచనలకు పదునుపెడుతున్నాయి. ఉపాధ్యాయుల దిశానిర్దేశనంలో అద్భుతాలు ఆవిష్కరిస్తున్నాయి. రోజువారీ జీవితంలో సామాన్యులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు సులువైన, చవకైన పరిష్కార మార్గాలను చూపుతున్నాయి. ప్రతిభను చాటుతూ అందరినీ అబ్బురపరుస్తున్నాయి. అలాంటి బాలమేధావులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఇన్స్పైర్ పోటీలు చక్కని వేదికగా నిలుస్తున్నాయి.
తాజాగా ఇన్స్పైర్ మానక్ అవార్డ్ 8వ జాతీయస్థాయి ప్రదర్శన పోటీలను ఏప్రిల్ 23 నుంచి 27 వరకు ఆన్లైన్లో నిర్వహించనుండగా, ఆ ఎగ్జిబిషన్కు హైదరాబాద్ జిల్లా నుంచి మూడు ప్రాజెక్టులు ఎంపికవడం విశేషం. షేక్పేట్ మండలంలోని భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థి రవికార్రెడ్డి రూపొందించిన ‘ఈజీ లిఫ్ట్’, ముషీరాబాద్ మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని సాఫియాబేగం రూపొందించిన ‘స్మార్ట్ గ్లౌజ్’, నాంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని పూజా జైన్ రూపొందించిన ‘ఆటో క్లీన్ యూరినల్ కమ్ వాటర్ లిఫ్ట్’కు చోటు దక్కింది.
భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థి రవికార్రెడ్డి తన గైడ్ టీచర్ కవిత మార్గదర్శకత్వంలో ‘ఈజీ లిఫ్ట్ రైజర్’ను ఆవిష్కరించారు. దీని ఆధారంగా రోగులు, వృద్ధులు, గాయాలపాలైన వారు ఎలాంటి శారీరక శ్రమ అవసరం లేకుండా తమ పనులను ముగించుకోవచ్చు. వారి సంరక్షకులకు సైతం ఈజీ లిఫ్ట్ ఎంతో ఉపయోగపడనున్నది. ఈజీ లిఫ్ట్ను ఉపయోగించి రోగి, ప్రమాదబాధితుడిని బెడ్ నుంచి టాయిలెట్కు, వీల్చైర్పైకి, బెడ్పైకి సులభంగా తీసుకెళ్లవచ్చు. రోగి కూర్చోవడానికి, నిలబడడానికి, పట్టుకోవడానికి అనుగుణంగా దీనిని రూపొందించడంతోపాటు కేర్ టేకర్ సైతం సులభంగా పట్టుకునేలా దీనిని తీర్చిదిద్దారు. తన అమ్మమ్మ స్నానం చేసేందుకు, టాయిలెట్కు వెళ్లేందుకు పడిన ఇబ్బందులను దగ్గరి నుంచి చూశానని, అలాంటి బాధలు ఎవరూ పడకూడదనే ఉద్దేశంతోనే దీనిని రూపొందించానని విద్యార్థి రవికార్రెడ్డి వెల్లడించడం అభినందనీయం.
నాంపల్లి మండలం ఇసామియాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని పూజాజైన్ గైడ్ టీచర్ వాణిశ్రీ నేతృత్వంలో ‘ఆటో క్లీన్ యురినల్ కమ్ వాటర్ లిఫ్ట్’ను రూపొందించారు. ఒక వ్యక్తి యురినల్ చేసేందుకు టాయిలెట్ ద్వారం తెరవగానే నీటి ట్యాంకు నుంచి నీరు మొదటగా సక్షన్ పంపు ద్వారా మొదటి తొట్టిలోకి చేరుకుంటాయి. వ్యక్తి మూత్రవిసర్జనకు స్ప్రింగ్ ఫ్లాట్ఫారంపై నిలబడినప్పుడు అది కిందికి జరగడంతో అక్కడి నల్లా తెరచుకొని మొదటి తొట్టిలో ఉన్న నీరు డ్రైన్పై అమర్చిన రిజర్వాయర్కి చేరుతుంది. వ్యక్తి ఫ్లాట్ఫామ్ దిగగానే మొదట నల్లా మూసివేయబడి, రెండవ నల్లా తెరచుకుంటుంది. దాని నీరు డ్రైన్లో పడిపోయి ఆటోమేటిక్గా శుభ్రమవుతుంది. అపరిశుభ్ర నీరు సోలార్ డ్రైయింగ్ బాక్స్లోకి చేరి సూర్యుని వేడికి అవిరై, అందులోనే చల్లబడి తిరిగి నీరుగా మారి ట్యాంకులోకి చేరతాయి.
సీతాఫల్మండి ప్రభుత్వ ఉన్నతపాఠశాల విద్యార్థిని సాఫియాబేగం తన గైడ్ టీచర్ పద్మజ నేతృత్వంలో స్మార్ట్ గ్లౌజ్ను రూపొందించింది. దీనిని ధరించిన డ్రైవర్కు గుండె వేగం, రక్తప్రసరణ తీరు తెలియడంతోపాటు, ఆ వివరాలు సదరు వాహన చోదకుడి కుటుంబీకుల సెల్ఫోన్కు మెసేజ్ రూపంలో అందుతాయి. వాటిని గమనించి డ్రైవర్ అప్రమత్తం కావడంతోపాటు ప్రమాదాల బారిన పడకుండా చూసే వీలు కలగనున్నది.
జాతీయ పోటీలకు ఎంపికైన విద్యార్థులు తమ ప్రాజెక్టులను మరింత మెరుగుపరుచుకునే అవకాశముంది. ఆ దిశగా గైడ్ టీచర్లు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు, ప్రధానోపాధ్యాయులు ప్రోత్సహించాలి. ఆ ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను నిర్ణీత పద్ధతిలో ఇన్స్పైర్ మానక్ కాంపిటేషన్ యాప్లో ఏప్రిల్ 10వ తేదీలోగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. జాతీయ స్థాయిలోనూ విద్యార్థులు సత్తా చాటాలి. – ధర్మేందర్, హైదరాబాద్ జిల్లా సైన్స్ అధికారి
విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీయాలి. ఆ దిశగా వారిని ప్రోత్సహిస్తే అద్భుత ఫలితాలు వస్తాయి. వారి ఆలోచనలకు రూపమిస్తే సమాజంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అందుకు ఇన్స్పైర్ పోటీలకు ఎంపికైన విద్యార్థులే నిదర్శనం. వారు జాతీయస్థాయిలోనూ రాణించాలి. – రోహిణి, హైదరాబాద్ డీఈవో