కొండాపూర్, ఆగస్టు 27 : రైతులకు మేలు చేకూర్చేలా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) ప్రొఫెసర్లు సరికొత్తగా ఇంటిగ్రేటెడ్ అగ్రి బ్లాక్చైన్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్లర్నింగ్ల సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే బ్లాక్చైన్ ప్రాసెస్ను గత రెండేండ్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు వర్సిటీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ప్రొఫెసర్లు విజయ్ మరిశెట్టి, వర్ష మామిడి పేర్కొన్నారు. ఇంక్లూజివ్ గ్రోత్ చైన్ పేరుతో ఈ ప్రాజెక్ట్ను హెచ్సీయూ, సమున్నతి సంస్థలు సంయుక్తంగా రైతుల మేలు కోసం అందుబాటులోకి తీసుకువస్తున్నారన్నారు. ఇందులో కొంతమంది రైతులు కలిసి ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ (ఎఫ్పీఓ)గా ఏర్పడి బ్లాక్చైన్లో ఎఫ్పీఓ పూర్తి వివరాలను పొందుపర్చినట్లయితే, వారికి సంబంధించిన ప్రతి కొనుగోలు, అమ్మకాల వివరాలు పారదర్శంగా పొందుపర్చబడతాయన్నారు. ఇప్పటికే తమిళనాడులో 30 వేల మంది రైతులు ఎఫ్పీఓగా ఏర్పడి ఈ టెక్నాలజీ ద్వారా లాభసాటి వ్యాపారాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. రైతులకు మేలు చేకూర్చేలా ఇంటిగ్రేటెడ్ అగ్రి బ్లాక్చైన్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే కామారెడ్డిలో ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఇక్కడ విజయవంతంగా కొనసాగితే దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు.