Hyderabad | హైదరాబాద్ కేంద్రంగా 40కిపైగా పరిశోధన కేంద్రాలు ఉన్నాయి. మొక్కల నుంచి మొదలుకుంటే జంతు సంబంధిత పరిశోధనలు హైదరాబాద్ వేదికగా జరుగుతాయి. ఇందులో ప్రధానంగా హబ్సిగూడలోని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలార్ బయాలజీ, జాతీయ పోషకాహార సంస్థ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఎన్జీఆర్ఐతోపాటు, ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్, సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్, ఎన్ఆర్ఎస్సీ వంటి పలు పరిశోధన సంస్థలన్నీ కూడా లైఫ్ సైన్సెస్ రంగంలో ఆధునిక పరిశోధనలు, అధ్యయనాలకు నిలయంగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్లో ఉన్న పరిశోధన సంస్థలకు గుర్తింపు ఉండటంతో స్టడీ టూర్లకు వచ్చే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడానికి కారణంగా మారింది.
బెంగళూరులోని సైన్స్ సిటీ తరహాలో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న పరిశోధన సంస్థలను సందర్శించడానికి విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో గడిచిన రెండు నెలల వ్యవధిలో కేరళ, తమిళనాడుతోపాటు ఉత్తర భారతం నుంచి వచ్చే విద్యార్థుల బృందాల సంఖ్య 40కిపైనే ఉంటుంది. ముఖ్యంగా పాఠశాలల విద్యార్థుల కంటే కాలేజీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్డీ చదువుతున్న విద్యార్థులు కూడా వైజ్ఞానిక సందర్శనలకు ఆసక్తి చూపుతున్నారు.
ముఖ్యంగా సీఎస్ఐఆర్ అనుబంధ సంస్థలైన సీఎస్ఐఆర్ సీసీఎంబీ, ఎన్జీఆర్, సీడీఎఫ్డీ వంటి అనుబంధ సంస్థలను విజిట్ చేసేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు. సందర్శనకు వచ్చిన విద్యార్థులకు తమ సెంటర్లోని ల్యాబోరేటరీలను, మోడల్ బయోగ్యాస్ ప్లాంట్, కెమికల్ ల్యాబోరేటరీ, పాలిమర్ ప్రాసెసింగ్ ల్యాబ్లను సందర్శించే వీలు కల్పిస్తా మని ఐఐసీటీ పరిశోధకులు తెలిపారు.
స్టడీ టూర్లకు వచ్చే వారిలో ఎక్కువగా డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థులే ఉంటున్నారు. ఎక్కువగా డిగ్రీ తర్వాత ఉన్నత విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలపై అవగాహన పెంచుకోవడంలో ఈ టూర్లతో సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ల్యాబోరేటరీలో జరిగే పరిశోధనలపై ప్రయోగాత్మక విశ్లేషణ ద్వారా అవగాహన పొందడానికి ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు.
పుస్తకాల్లో చదివే ఎన్నో పరిశోధన ఫలితాలకు అక్కడే సమాధానం దొరుకుతుంది. రసాయనిక చర్యల నుంచి మొదలుకుంటే జన్యువుల్లో జరిగే జీవ క్రియల వరకు విషయాలను స్వయంగా సంబంధిత పరిశోధకులే వివరిస్తారు. అందుకే వైజ్ఞానిక ప్రదర్శనలకు వేదికలుగా నిలిచే పరిశోధనాభివృద్ధి సంస్థలకు విశేషమైన ఆదరణ వస్తున్నది.
గడిచిన రెండు నెలల వ్యవధిలో ఏకంగా 40కిపైగా విద్యార్థుల బృందాలు నగరంలోని పలు పరిశోధన సంస్థలను సందర్శించాయి. స్టడీ టూర్లకు వచ్చేవారిలో రాష్ట్రంలోని పలు జిల్లాలతోపాటు, ఇతర రాష్ర్టాలకు చెందిన విద్యార్థులు, యువ పరిశోధకులు కూడా ఆసక్తి చూపుతున్నారు. దీంతో లైఫ్ సైన్స్ రంగంలో హైదరాబాద్ విజ్ఞానాన్ని పంచే వేదికగా నిలుస్తున్నది.
– సిటీబ్యూరో, మార్చి 9 (నమస్తే తెలంగాణ)