అవగాహన లోపం అనర్థానికి దారి తీసింది. నిబంధనలు ఉల్లంఘించి.. నిర్లక్ష్యం వహిస్తే నిండు ప్రాణం పోయింది. వర్షం పడిన ప్రతిసారీ నగరంలో నోరు తెరుచుకుంటున్న మాన్హోల్స్, నాలాలు మృత్యుకుహరాలుగా మారుతున్నాయి. ప్రగతినగర్లో నాలుగేళ్ల చిన్నారికి నిండు నూరేళ్లు నిండడానికి నిబంధనల ఉల్లంఘనే కారణమని అధికారులు గుర్తించారు. అపార్ట్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడి ఆదేశాలతోనే వాచ్మెన్ వరద కాలువ మూత తొలగించాడని పోలీసుల విచారణలో తేలింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వరద నీరు నిల్వ ఉంటే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలి. అంతేగానీ సొంత నిర్ణయాలు, నిర్వహణ ప్రక్రియ చేపట్టవద్దని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 7(నమస్తే తెలంగాణ): మ్యాన్హోల్స్ మూతలు సంబంధిత శాఖ సిబ్బంది మాత్రమే తెరవాలనే నిబంధనల తెలియని అవగాహన లోపం.. వరద నీరుపోతే చాలు.! కానీ, మ్యాన్హోల్ నోరుతెరిస్తే జరిగే అనర్ధాలు ఎలా ఉంటాయోనని ఆలోచించని నిర్లక్ష్యం.. వెరసి ప్రగతినగర్లో నాలుగేళ్ల పసి ప్రాయానికి నిండు నూరేళ్లు నిండాయి. ఇదో ఉదాహరణ మాత్రమే. వర్షం పడిన ప్రతిసారీ నగరంతో పాటు శివారుల్లో ఎక్కడో అక్కడ… ఇలా అనేక మంది నిర్లక్ష్యంగా, ఇష్టానుసారంగా మ్యాన్హోల్స్ మూతల్ని తెరవడం పరిపాటిగా మారింది. వాస్తవానికి ఇలా ప్రైవేటు వ్యక్తులు మ్యాన్హోల్స్ మూతలు తెరవడం నేరమని పురపాలక శాఖ చట్టాలు చెబుతున్నాయి. సమస్య ఉంటే సంబంధిత అధికారులకు సమాచారమివ్వాలి. ఇలా సొంత నిర్ణయాలు, నిర్వహణ ప్రక్రియలు చేపట్టవద్దని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
మురుగునీటి పారుదలతో పాటు వర్షపు నీటి ప్రవాహానికి గాను సాధారణంగా రెండు వేర్వేరు వ్యవస్థల నిర్మాణం ఉంటుంది. మురుగునీటి పారుదల కోసం ఉన్న డ్రైనేజీ వ్యవస్థ.. వాన నీటి కోసం వరదనీటి కాల్వల (స్ట్రామ్వాటర్ డ్రైనేజీ) వ్యవస్థ ఉంటుంది. నిర్వహణలో భాగంగా వీటిపై మ్యాన్హోల్స్ ఏర్పాటు చేస్తారు. నగరంతో పాటు శివారుల్లోనూ ఈ వ్యవస్థలు ఉన్నాయి. అయితే, మురుగునీటి పారుదల వ్యవస్థను జలమండలి.. శివారుల్లో సంబంధిత స్థానిక సంస్థలు నిర్వహిస్తాయి. వరద నీటి కాల్వల వ్యవస్థను నగరంలో జీహెచ్ఎంసీ నిర్వహిస్తుంది. శివారుల్లోనైతే సంబంధిత స్థానిక సంస్థల పరిధిలోనే ఈ వ్యవస్థ నిర్వహణ ఉంటుంది. మురుగునీటి వ్యవస్థలో భాగంగా నిర్మించే మ్యాన్హోల్స్ గుండ్రంగా ఉంటే, వరద నీటి కాల్వల వ్యవస్థలో ఉండే మ్యాన్హోల్స్ చతురస్రాకారంలో ఉంటాయి.
ప్రధానంగా భారీ మురుగునీటి వ్యవస్థ ఉన్న చోట లోతు ఎక్కువగా ఉన్నందున.. ఆ మ్యాన్హోల్స్పై ఎర్రటి కలర్ గుర్తులు (హెచ్డీపీ) ఉంటాయి. సాధారణంగా ఈ వ్యవస్థల నిర్వహణలో భాగంగా మరమ్మతులు, పూడికతీత కోసం మాత్రమే సంబంధిత సిబ్బంది మ్యాన్హోల్స్ మూతల్ని తెరుస్తారు. వర్షాల సమయంలో భారీ వరద వచ్చినపుడు కూడా వరద నీరు నిల్వ ఉండకుండా.. వెంటనే నీరు ప్రవహించేందుకుగాను మ్యాన్హోల్స్ మూతను తెరుస్తారు. సంబంధిత సిబ్బంది మాత్రమే ఈ ప్రక్రియను నిర్వహించాల్సి ఉంటుంది. ప్రైవేటు వ్యక్తులు వీటిని తొలగించకూడదని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి.
అనాలోచితంగా సొంత నిర్ణయాలు..
భారీ వర్షాలు పడినపుడు నగరంలో, శివారు ప్రాంతాల్లో కొందరు సొంత నిర్ణయాలతో ఈ మ్యాన్హోల్స్ మూతల్ని తెరవడం సాధారణంగా మారింది. తమ ఇంటి దగ్గరో, అపార్టుమెంటు దగ్గరో నీరు నిల్వ ఉండకుండా త్వరితగతిన వెళ్లేందుకు.. ఎవరికి వారు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మూడు రోజుల కిందట నాలా పైకప్పును ప్రైవేటు వ్యక్తులు తెరిచారు. 22వ డివిజన్లో ఉన్న స్పేటియల్ గార్డేనియా అపార్టుమెంటు సంక్షేమ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య సూచన మేరకు వాచ్మన్ భరత్ నాలా పైకప్పును తొలగించాడు.
దీంతో అక్కడ నీరు నిల్వ ఉండటంతో అది గుంతగా కనిపించక.. నాలుగేండ్ల మిథున్ అనే చిన్నారి అందులో పడి మృత్యువాతపడ్డాడు. వాస్తవానికి వరద నీరు తొందరగా వెళ్లిపోవాలంటే సదరు అపార్టుమెంటు వాళ్లు కార్పొరేషన్ అధికారులకు సమాచారమివ్వాలి. సంబంధిత సిబ్బంది అక్కడికి వచ్చి నాలా పైకప్పును తెరిచినట్లయితే వరద పోయే వరకు అక్కడే ఉంటారు. తర్వాత యథావిధిగా మూతను మూసేస్తారు. లేకపోతే చుట్టూ రక్షణ చర్యలు తీసుకొని ఉంటారు. కానీ, ప్రైవేటు వ్యక్తులు అవగాహన లోపంతో నిర్ణయం తీసుకోవడం వల్ల ఓ చిన్నారి బలి కావాల్సి వచ్చింది. ప్రైవేటు వ్యక్తులు మ్యాన్హోల్స్ మూత తెరవడం నేరం అయినందునే నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కారకులైన కృష్ణయ్య, భరత్పై పోలీసులు కేసు నమోదు చేశారు.
సమస్య ఉంటే సమాచారమివ్వండి..
వర్షాకాలం వచ్చిన దరిమిలా ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రేటర్ పరిధిలో, శివారు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్, కార్పొరేషన్ అధికారులు, యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నారు. ఈ మేరకు అన్ని ప్రాంతాల్లో ఎమర్జన్సీ రెస్పాన్స్ టీంలను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు భారీ వర్షాల సమయంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని కూడా ప్రభుత్వం, అధికార యంత్రాంగం ముందుగానే హెచ్చరిస్తున్నది. ప్రజలు సహకరిస్తేనే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. వరద నిర్వహణతో పాటు కీలకమైన కరెంటుకు సంబంధించి సమస్య ఉన్నప్పుడు ప్రజలు సంబంధిత అధికారులను గానీ, కంట్రోల్ రూమ్కు గానీ ఫోన్ చేస్తే వెంటనే వారు వచ్చి సమస్యను పరిష్కరిస్తారు. ఒకవేళ నగరవ్యాప్తంగా భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇతర ప్రాంతాల్లో నిర్వహణ పనుల్లో ఉండటం వల్ల కొంత ఆలస్యం కావచ్చు. కానీ, ప్రజలు ఎవరికి వారు నిర్వహణ విషయంలో సొంత నిర్ణయాలు తీసుకొని, మ్యాన్హోల్ మూతలు తెరవడం, విద్యుత్ వ్యవస్థ నిర్వహణకు సిద్ధపడటంతో వారితో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు తెచ్చిన వారవుతారని నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పారిశుధ్య నిర్వహణ ఇన్ఛార్జి సుకృత సూచించారు.
బాలుడి మృతి ఘటనలో…
దుండిగల్,సెప్టెంబర్7: ప్రగతినగర్లోని ఎన్ఆర్ఐ కాలనీలోని వరదనీటి కాలువలో పడి నాలుగేండ్ల మిథున్రెడ్డి మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదం జరగడానికి ముందే వరదనీటి కాలువపై ఉన్న బిల్లను అపార్టుమెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణయ్య సూచనతో వాచ్మన్ భరత్ తొలగించినట్లు తేలడంతో వారిద్దరిపై కేసు నమోదు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం కురిసిన భారీ వర్షంతో వీదులన్నీ వరదనీటితో నిండిపోయాయి. వరదనీరు త్వరగా వెళ్లాలనే ఉద్దేశంతో తమ అపార్టుమెంట్ ముందు ఉన్న వరదనీటి కాలుపై ఏర్పాటు సిమెంట్ బిల్లలను స్పేషియల్ గార్డేనియా అపార్టుమెంట్ అధ్యక్షుడు కృష్ణయ్య దగ్గరుండి వాచ్మన్ భరత్తో తీయించాడు.
ఇది తెలియని బాలుడు మిథున్రెడ్డి ఓ వృద్ధుడి వెనుకాలే వెళుతూ.. నాలాలో పడి నిజాంపేటలోని తుర్క చెరువులోకి కొట్టుకు పోయాడు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కలిసి సాయంత్రాని కల్లా బాలుడి మృతదేహాన్ని వెలికి తీసిన విషయం విధితమే. అయితే, అదే రోజు మున్సిపల్ అధికారులు ఈ ఘటనపై విచారణ జరిపి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ 174 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అపార్టుమెంట్ అసోసియేషన్ అధ్యక్షులు, వాచ్మన్ వరద కాలువపై ఉన్న బిల్లలను తీయడంతోనే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో కృష్ణయ్య, భరత్పై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ సుమన్కుమార్ తెలిపారు.