Borabanda | ఎర్రగడ్డ, ఏప్రిల్ 20: వందల సంఖ్యలో ఆర్టీసీ బస్సుల ట్రిప్పులు.. వేల సంఖ్యలో ప్రయాణికుల రాకపోకలు.. కానీ అక్కడ ప్రయాణికుల కోసం ఒక్క షెల్టర్ అయినా కనిపించదు. ఉన్న ఒక్క షెల్టర్ రెండు నెలల క్రితం హోటల్గా మారింది. దీంతో ప్రయాణికులు ఎండా వానలను భరిస్తూ బస్సుల కోసం వేచి చూసే దుస్థితి. బోరబండ బస్ టెర్మినల్లో ఈ పరిస్థితి ఉంది.
బోరబండలో ఇదివరకు బస్ షెల్టర్ ఉంది. అయితే రెండు నెలల క్రితం హోటల్గా మార్చేశారు. కాంగ్రెస్ నాయకులుగా చలామణి అవుతున్న డివిజన్కు చెందిన కొందరు రెండు నెలల క్రితం ఈ బస్ షెల్టర్ను హోటల్గా మార్చేయడంలో తెర వెనుక ఉండి కథ నడిపించారు. అయితే ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన బస్ షెల్టర్ను హోటల్గా మార్చేయడం అప్పట్లో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కానీ అటు బల్దియా, ఇటు ఆర్టీసీ అధికారులు మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో ఎండాకాలంలో ప్రయాణికులు మండు టెండలోనే బస్సుల కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి బస్ షెల్టర్ను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే టెర్మినల్లో ఉన్న ఇతర ఆక్రమణలను తొలగించి మరో రెండు బస్ షెల్టర్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.