ఖైరతాబాద్, సెప్టెంబర్ 5 : ఖైరతాబాద్లో నవరాత్రుళ్లు పూజలందుకున్న శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి నిమజ్జన ఘట్టంలో ప్రధానమైన శోభాయాత్ర శోభాయామనంగా ప్రారంభం కానున్నది. మహాగణపతి 71 సంవత్సరాల ప్రస్థానంలో ఈ ఏడాది 69 అడుగుల మట్టి విగ్రహాన్ని ప్రతిష్టించారు. భారీ విగ్రహాన్ని తరలించేందుకు ఆనావాయితీగా ఈ ఏడాది కూడా భారీ ట్రాలీ రథసారథిగా నిలుస్తున్నది.
దశాబ్దాలుగా మహాగణపతి శోభాయాత్రకు ఉచితంగా వాహనాన్ని అందిస్తున్న ఎస్టీసీ ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఏడాది కూడా తన సేవలను కొనసాగిస్తున్నది. 75 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పుతో 100 టన్నులు మోసే సామర్థ్యం ఉన్న 26 చక్రాల ట్రాలీపై 50 టన్నుల బరువు ఉన్న మహాగణపతి నిమజ్జనానికి తరలిస్తున్నారు. ఈ భారీ వాహనానికి రథసారధిగా సూర్యపేట జిల్లా ముకుందాదేవులపల్లికి చెందిన మందాడి వెంకట్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.
శోభాయాత్ర సాగుతుందిలా..
శుక్రవారం సీఎం దర్శనం నేపథ్యంలో ఏర్పాట్లలో కొంత ఆలస్యం జరిగినా.. సమాయానికి శోభాయాత్ర, నిమజ్జనం పూర్తవుతుందని ఉత్సవ కమిటీ తెలిపింది. కాగా, రాత్రి 12 గంటలకు కలశ పూజ, ప్రతిమ ఉద్వాసన, మహాగణపతిని రవిక్రేన్స్ సాయంతో ట్రాలీపై ఉంచి వెల్డింగ్ నిర్వహించి, అలంకరణ పూర్తి చేస్తారు. 400 మంది పోలీసుల పహారాలో ఉదయం 6.30గంటలకు గణపతి ప్రాంగణం నుంచి శోభాయాత్ర ప్రారంభమై రాజ్దూత్ చౌరస్తా, బీఎస్ఎన్ఎల్ భవన్, పాత సచివాలయం గేటు, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి నిమజ్జన ఘాట్కు 11గంటల వరకు చేరుకుంటుంది. ఆనవాయితీగా ఈ ఏడాది కూడా క్రేన్ నం.4 వద్దే నిమజ్జనం చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.
మహాగణపతిని దర్శించుకున్న సీఎం
ఖైరతాబాద్లో కొలువుదీరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి ఆయన పూజల్లో పాల్గొన్నారు. ఖైరతాబాద్ మహాగణపతికి ప్రపంచంలోనే ప్రత్యక గుర్తింపు ఉందని, తద్వారా తెలంగాణ సైతం గుర్తింపు వచ్చిందన్నారు. 71 సంవత్సరాలుగా ఉత్సవాలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. అనంతరం ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే దానం నాగేందర్, ఉత్సవ కమిటీ సభ్యులు, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జెల నగేశ్, ఇతర సభ్యులు సింగరి రాజ్ కుమార్, మహేశ్ యాదవ్, కృష్ణా యాదవ్ తదితరులు గణపతి ప్రతిమను అందజేశారు.