సిటీబ్యూరో, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం)లో 35వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన ఆదివారం కిటకిటలాడింది. సెలవు రోజు కావడంతో పుస్తక జాతరకు సాహితీ ప్రియులు, రచయితలు, చిన్నారులు సహా జనం పోటెత్తారు. పలువురు ప్రముఖులు కూడా సందర్శించి తమకు నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేసి మురిసిపోయారు.
ప్రజా ప్రస్థానం పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న పుస్తక ప్రదర్శన అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ తదితరులు
రాళ్లకుచ్చె పుస్తకావిష్కరణ..
దాసరి మోహన్ రాసిన రాళ్లకుచ్చె కథా సంపుటిని తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో తెలంగాణ రచయితల సంఘం జంటనగరాల ఆధ్వర్యంలో తెలంగాణ కవులు ఆవిషరించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాహిత్య ఆకాడమీ పూర్వ చైర్మన్ నందిని సిధారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ గ్రామీణ సౌందర్యాన్ని దాసరి మోహన్ ఈ కథలో పొందుపర్చడం సంతోషకరమని అన్నారు. తెలంగాణ పల్లె పరిమళాలు రాళ్లకుచ్చెలో ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో తంగేడు పత్రిక ఎడిటర్ కాంచనపల్లి గోవర్ధన్, తెలంగాణ రచయితల సంఘం జంటనగరాల అధ్యక్షుడు కందుకూరి శ్రీరాములు, ప్రముఖ కవి కూర చిదంబరం తదితరులు పాల్గొన్నారు.
మన ముఖ్యమంత్రి స్టాల్లో దటీజ్ కేసీఆర్ పుస్తకాన్ని ప్రదర్శిస్తున్న ఎమ్మెల్సీ కవిత, చిత్రంలో తెలంగాణ సాహిత్య అకాడమీచైర్మన్ జూలూరు గౌరీశంకర్
వాల్మీకి, బసవేశ్వరుడు,బుద్ధ పుస్తకాల పునర్ముద్రణ సభ..
బీసీసీఈ పుస్తకాలు వాల్మీకి, బసవేశ్వరుడు, బుద్ధ పుస్తకాల పునర్ముద్రణ సభను నిర్వహించారు. ప్రొఫెసర్ తిరుమలి, రిటైర్డ్ జేసీ వై.సత్యనారాయణ, కవి అధ్యాపకులు, నాళేశ్వరం శంకరం తదితరులు ప్రసంగించారు. ప్రొ. తిరుమలి మాట్లాడుతూ స్ఫూర్తిప్రదాతల సంక్షిప్త జీవిత చరిత్రలపై పుస్తకాలు రావడం ఆహ్వానించదగ్గ విషయమని అన్నారు.సభలో వాల్మీకి బోయ ప్రతినిధులు, లింగాయతులు, పాల్గొన్నారు.