జై బోలో గణేశ్ మహరాజ్కీ జై.. గణపతి బప్పా మోరియా.. నినాదాలతో ఖైరతాబాద్ పరిసరాలు మార్మోగాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో ఇసుకేస్తే రాలనంతగా భక్తజనం.. మహాగణపతిని దర్శించుకునేందుకు పోటెత్తింది. ఉదయం నుంచే భారీ క్యూలైన్లు కనిపించాయి. లక్షల్లో భక్తులు దర్శించుకున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. మరోవైపు ఇంటి గణపతులు సాగర తీరంవైపు అడుగులు వేస్తుండటంతో నగరమంతా బొజ్జ గణపయ్యల సందడి నెలకొన్నది. హుస్సేన్ సాగర్లో వినాయకులను నిమజ్జనం చేసేందుకు శివార్ల నుంచి సైతం తరలివస్తుండటంతో ట్యాంక్బండ్ ప్రాంతమంతా కోలాహలంగా కనిపిస్తున్నది. నిమజ్జనం సవ్యంగా సాగేలా అధికార యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నది.