శ్రీనగర్ కాలనీ, ఏప్రిల్ 18: విపత్తుల్లో ఆస్తులను కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారని, వారి సేవలు అమోఘమని హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. నెక్లెస్ రోడ్డులోని పీపుల్ ప్లాజా వద్ద ఆదివారం అగ్నిమాపక విభాగం వారోత్సవాల్లో భాగంగా ‘సైక్లోథాన్ ఆఫ్ 5 కేఎం’ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అగ్నిమాపక విభాగం పరికరాల స్టాల్ను ఆయన సందర్శించారు. అంతకు ముందు కర్తవ్య నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపక దళ సిబ్బందికి నివాళులర్పించారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ విపత్తులు, ప్రమాదాల వేళ అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి ఎన్నో ప్రాణాలను కాపాడి, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల పరి రక్షణకు కృషి చేస్తున్నారని వెల్లడించారు.
ప్రతి రోజు 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉండి అగ్నిమాపక విభాగం సేవలను అందిస్తున్నారని గుర్తుచేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రతి మండల కేంద్రంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు ప్రాధాన్యమిచ్చామని వెల్లడించారు. 2019లో 770 కోట్ల ఆస్తులను కాపాడగా, గతేడాది 799 కోట్ల ఆస్తులను అగ్నిమాపక విభాగం సిబ్బంది కాపాడారని వెల్లడించారు. కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ డీజీ సంజయ్కుమార్జైన్, డైరెక్టర్ లక్ష్మి ప్రసాద్, ఉన్నతాధికారులు నారాయణ్రావు, పాపయ్య, అధికారులు పాల్గొన్నారు.