సిటీబ్యూరో, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం హత్య జరిగిన నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని హోం మంత్రి మహమూద్ అలీ ఆదేశించారు. లక్డీకాపూల్లోని తన కార్యాలయంలో.. నగర సీపీ అంజనీకుమార్, అడిషనల్ సీపీ (క్రైమ్స్) శిఖా గోయల్, సౌత్ జోన్ డీసీపీ గజరావు భూపాల్, మీర్చౌక్, సంతోష్నగర్, చార్మినార్, ఫలక్నూమా ఏసీపీలతో హోంమంత్రి సమీక్ష నిర్వహించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హత్యలు, నేరాల అదుపునకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్ధరాత్రి వేళ వ్యాపారాలను తప్పనిసరిగా నిలిపివేయాలని ఆదేశించారు. పాతబస్తీ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన బలగాలను వినియోగించాలని, నేరరహిత నగరంగా హైదరాబాద్ను కొనసాగించాలని సూచించారు.