మణికొండ, మార్చి 11: ఉన్నత చదువులు చదివారు. కార్పొరేట్ ఉద్యోగాలు చేసే సత్తా ఉన్నా మనసుకు నచ్చే పని చేయాలన్న తలంపుతో ఉన్న నలుగురు స్నేహితులు వినూత్నంగా ఆలోచించారు. ఆరోగ్యవంతమైన సమాజమే లక్ష్యంగా మిద్దె తోటలు సాగు చేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడువుగా హోం క్రాప్ అంకుర సంస్థను ఏర్పాటు చేశారు. ‘మీ ఇంటికే వస్తాం.. మిద్దె పంటలు పండిస్తాం’ అంటూ ఔత్సాహికులను గుర్తించి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. పలు సూచనలు, సలహాలు ఇస్తూ సేంద్రియ సాగు చేపట్టారు. అందుబాటులో ఉన్న స్థలాల్లో నాణ్యమైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండిస్తున్నారు. ఇప్పటికే వెయ్యి ఇండ్లపై పంటలు సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మరో అడుగు ముందుకేసి దేశంలో ఎక్కడా లేని విధంగా పాఠశాలల్లోనూ సేంద్రియ సాగుపై తరగతులు నిర్వహిస్తున్నారు.
కరీంనగర్ జిల్లాకి చెందిన కృష్ణారెడ్డి, అజయ్ బిర్లా, మన్వితారెడ్డి, షర్మిలారెడ్డి, సాయికృష్ణారెడ్డి స్నేహితులు. ఉన్నత విద్యను అభ్యసించిన వారు వినూత్నమైన ఆలోచనతో మిద్దె తోటలపై సేంద్రియ సాగు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఏడాది పాటు శ్రమించి సాగులో మెళకువలు నేర్చుకున్నారు. హోం క్రాప్ అంకుర సంస్థను ఏర్పాటు చేసి మహానగరంలో పెద్దపెద్ద బంగ్లాలతో పాటు శివార్లలో ఉన్న స్థలాలను గుర్తించి పంటలు పండిస్తున్నారు. ఇంటి ముందు బాల్కానీ, మిద్దెలపై పంటలను వీలుగా ప్రత్యేకంగా జియో టెక్స్టైల్ ఫ్యాబ్రిక్ బ్యాగులను తయారు చేశారు. వంకాయ, టమాట, బీర కోసం ఇజ్రాయిల్ నుంచి హై ఇంపాక్ట్ పాలిస్టిక్ సంచులను తెప్పించారు. ఇందులో కొబ్బరి పొట్టు, వర్మి కంపోస్ట్ను నింపుతున్నారు. ఈ మిశ్రమం మొక్కలకు కావాల్సిన పోషకాలను అందిస్తుండగా పంటలన్నీ ఏపుగా పెరిగి అధిక దిగుబడులు ఇస్తున్నాయి. విస్తీర్ణం, వేసిన పంటలను బట్టి రుసుం వసూలు చేస్తున్నారు. అంతేకాక నెలనెలా పంటలను పరిశీలించి కావాల్సిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు.
వినూత్నంగా మిద్దెతోటలను సాగు చేస్తూనే.. మరోవైపు భవిష్యత్ తరాలకు వ్యవసాయంపై అవగాహన పెంచేందుకు దేశంలోనే మొదటి సారిగా పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు హోం క్రాప్ నిర్వాహకులు. పలు పాఠశాలలకు వెళ్లి అక్కడి విద్యార్థులకు తక్కువ స్థలంలో ఎక్కువ పంటలు ఎలా పండించాలో నేర్పిస్తున్నారు.
రసాయనాలతో పండే కూరగాయలను తిని అనేక మంది రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. మనకు నచ్చిన కూరగాయలను మనమే పండించుకునే అవకాశం ఉన్నా చాలా మంది పట్టించుకోవడం లేదు. బాల్కానీ, మిద్దెలపై ఉన్న ఖాళీ స్థలంలో అనేక పంటలు పండించుకొని ఆరోగ్యంగా జీవించవచ్చు. ఇదే లక్ష్యంతో హోం క్రాప్ పని చేస్తూ ఇప్పటివరకు వెయ్యి ఇండ్లపై హోం క్రాప్ సేంద్రియ పంటల సాగుకు కృషి చేస్తున్నది. అంతేకాక స్కూల్ క్రాప్ పేరిట విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. -అజయ్ బిర్జా, హోం క్రాప్ వ్యవస్థాపకుడు