కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే రంగుల పండుగ రానే వచ్చింది. సోమవారం కాముని దహనం పూర్తి కావడంతో మంగళవారమే హోలీ జరుపుకోనున్నారు. ఈ ఏడాది సహజ రంగులతోనే సంబురాల హోలీ జరుపుకోవాలని నగరవాసులు సన్నద్ధమయ్యారు. రసాయన రంగులు వాడకుండా చెట్లు, పూలతో చేసిన రంగులను వ్యవసాయ విశ్వవిద్యాలయంలో తయారు చేశారు. బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై రంగులు చల్లుకోకుండా నిషేధాజ్ఞలు పెట్టిన పోలీసులు ఇప్పటికే ఈ నెల 8వ తేదీ ఉదయం వరకు మద్యం దుకాణాలను మూసివేయించారు.
సిటీబ్యూరో, మార్చి 6 (నమస్తే తెలంగాణ): పండుగలు సంతోషంగా జరుపుకోవాలి. కానీ వాటి వల్ల విషాదాన్ని కొనితెచ్చుకోకూడదు. హోలీ పండుగను చిన్నా పెద్దా తేడా లేకుండా ఆనందోత్సాహాలతో సరదాగా జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా గతంలో అయితే సహజసిద్ధమైన రంగులు వినియోగించేవారు. దాని వల్ల అటు ప్రజలకే కాకుండా పర్యావరణానికి కూడా మంచిది. కానీ ప్రస్తుతం వినియోగిస్తున్న రంగులు పూర్తిగా రసాయనాలతో తయారు చేసినవి. ఈ రంగు నీళ్లు కళ్లలో పడితే అంధత్వానికి దారి తీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రసాయనాలతో కూడిన రంగుల వల్ల మనుషులకే కాకుండా జంతువులకూ ప్రమాదమే.
చిన్నారులకు హానికరం..
రసాయనాలతో తయారైన రంగులు పిల్లలు, ప్రజలకు హానికరం. చిన్నారుల చర్మం పలుచగా, సున్నితంగా ఉండటం వల్ల రసాయన రంగులు వారి చర్మంపై పడినప్పుడు అవి తీవ్రంగా దెబ్బతింటాయి. దీనివల్ల ఎలర్జీ, దద్దుర్లు రావడం, దురద తదితర చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. రసాయనాలతో కూడిన రంగులు నోట్లో పెట్టడం వల్ల అందులోని రసాయనాలు కడుపులోకి వెళ్లి కాలేయ, ఊపిరితిత్తులు, మూత్రపిండాలపై ప్రభావం చూపుతాయి. అలాగే నోట్లో పగుళ్లు ఏర్పడటం, చిగుళ్లు, దంతాలు దెబ్బతినడం, గొంతు ఇన్ఫెక్షన్కు గురవుతారు.
కంట్లో పడితే చూపు పోతుంది..
రసాయనాలతో కూడిన రంగులు కళ్లలో పడితే కంటిలోని రెటీనా, కార్నియా దెబ్బతింటాయి. ముఖ్యంగా రంగులను ముఖాలకు పూసుకున్నప్పుడు ఆ సమయంలో కళ్లు మూసుకోవాలి. ఈ రంగులు కళ్లలో పడటంతో కళ్లు మండటం, ఎర్రబడటం, కంటిలో నుంచి నీరు కారుతుంది. రంగులు పూసుకొనే సమయంలో కళ్లను పూర్తిగా కవర్ చేసే విధంగా కంటిఅద్దాలు వినియోగించడం ఉత్తమం.కళ్లలో రంగులు పడినప్పుడు నలపకూడదు. వెంటనే దగ్గరలో ఉన్న వైద్యులను సంప్రదించాలి. ముందస్తుగా శుభ్రమైన చల్లని నీటితో కళ్లను కడగాలి. కళ్లు ఎర్రబడి మండితే ప్రాథమిక చర్యగా టియర్ పల్స్ డ్రాప్స్ వాడాలి.
– డాక్టర్ ఎస్.రవీందర్గౌడ్, సరోజిని దేవి ,కంటి దవాఖాన మాజీ సూపరింటెండెంట్