సిటీబ్యూరో, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : మురుగునీటి నిర్వహణలో పారిశుధ్య కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని జలమండలి ఎండీ దానకిశోర్ అన్నారు. భద్రతా పక్షోత్సవాల్లో భాగంగా బుధవారం అంబర్పేట ఎస్టీపీ ప్రాంగణంలో జరిగిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికులు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమాదకరమైన పనులు చేయకూడదనే ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు సేవ చేయడం ఎంత ముఖ్యమో, కార్మికుల భద్రత అంతకంటే ముఖ్యమని వివరించారు. అనంతరం కార్మికులచే ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు ఎస్టీపీ ప్రాంగణంలో ఎండీ దానకిశోర్ మొక నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా.ఎం.సత్యనారాయణ, ఆపరేషన్స్ డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, స్వామి, ప్రాజెక్ట్ డైరెక్టర్ డి.శ్రీధర్బాబు, టెక్నికల్ డైరెక్టర్ పి.రవికుమార్, పలువురు సీజీఎంలు, జీఎంలు ఇతర అధికారులు పాల్గొన్నారు.