శ్రీనగర్కాలనీ, ఆగస్టు 24: జలమండలి విభాగంలో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగి, కార్మికుల భద్రతకు ప్రాధాన్యమిస్తున్నామని జలమండలి ఈడీ డాక్టర్ ఎం.సత్యనారాయణ తెలిపారు. మంగళవారం బంజారాహిల్స్ రోడ్డు నంబరు-7లోని ఓ అండ్ ఎం డివిజన్ కార్యాలయంలో జలమండలి భద్రతా అవగాహన పక్షోత్సవాల్లో భాగంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఈడీ ప్రారంభించారు. జలమండలి డివిజన్-6 పరిధిలోని 150 మందికి పైగా సిబ్బంది, కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందుల కిట్లను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జలమండలి మురుగునీటి నిర్వహణలో చేపట్టే మరమ్మతు పనుల్లో ప్రమాదాలను నివారించే దిశగా సాంకేతిక, యంత్ర పరికరాలను వినియోగిస్తున్నామని గుర్తుచేశారు. బస్తీలు, కాలనీల్లో చేపట్టే మురుగునీటి మరమ్మతు పనుల సందర్భంగా వినియోగించే భద్రత పరికరాలను సిబ్బందికి అందజేశామన్నారు. కార్యక్రమంలో సీజీఎం సుదర్శన్, డివిజన్ -6 జీఎం హరిశంకర్, జలమండలి కార్మికుల సంఘం అధ్యక్షుడు రాంబాబు యాదవ్, డీజీఎం శ్రీనివాస్, మేనేజర్లు స్వామిప్రసాద్, జలమండలి సిబ్బంది పాల్గొన్నారు.