వెంగళరావునగర్, ఆగస్టు 16 : భాగ్యనగరంలో మినరల్ వాటర్ కంటే శ్రేష్ఠమైన నీటిని ఇంటింటికీ సరఫరా చేస్తున్నామని జలమండలి ఎండీ.దానకిశోర్ అన్నారు. ఇటీవల జపాన్కు చెందిన ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో సైతం వెల్లడించిందని తెలిపారు. సోమవారం వెంగళరావునగర్ డివిజన్లోని సిద్దార్థనగర్ కమ్యూనిటీహాల్లో నిర్వహించిన జలమండలి భద్రత పక్షోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కృష్ణ, గోదావరి నీటితో నగర వాసుల దాహార్తిని తీర్చడంలో వేలాది మంది జలమండలి సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. కార్మికుల భద్రత విషయంలో రాజీ పడకుండా మెరుగైన భద్రతా పరికరాలను అందజేస్తున్నామని, ఇందుకు జర్మనీ నుంచి కార్మికులకు అవసరమైన రక్షణ షూట్లను తెప్పిస్తున్నామని పేర్కొన్నారు. మ్యాన్ హోళ్లలోకి కార్మికులను దింపకుండా యంత్రాలను ఉపయోగించి శుభ్రపరుస్తున్నామని తెలిపారు. మంత్రి కేటీఆర్ సూచన మేరకు పారిశుధ్య కార్మికులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించి.. సర్కిల్కు ఒక టీమ్ను కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ మహా నగరంలోనే కాకుండా ఔటర్ రింగ్ రోడ్డు పరిసరాల్లోని 190 గ్రామాలకు మంచినీటిని అందిస్తున్నామన్నారు. అనంతరం పారిశుధ్య కార్మికులను సన్మానించి కార్మికుల భద్రతకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జలమండలి సీజీఎం ప్రభు, ఎస్ఆర్నగర్ డివిజన్ జలమండలి మేనేజర్ హరిశంకర్, వెంగళరావునగర్ కార్పొరేటర్ దేదీప్యవిజయ్, సోమాజిగూడ డివిజన్ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్యాదవ్, ఎంఐఎం నేత షరీఫ్, కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, వాటర్ వర్క్స్ సిబ్బంది పాల్గొన్నారు.