మణికొండ, మే 23: నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని కోకాపేటలో 250 గజాల స్థలాల్లో అక్రమంగా వెలిసిన నిర్మాణాల కూల్చివేతలను హెచ్ఎండీఏ, టౌన్ప్లానింగ్ అధికారులు గురువారం చేపట్టారు. ఈ నెల 18న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘250 గజాల్లో 9 అంతస్తులు’ కథనానికి హెచ్ఎండీఏ అధికారులు స్పందించారు. ఈ మేరకు గురువారం స్థానిక మున్సిపల్ టౌన్ప్లానింగ్ అధికారులతో కలిసి అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చివేతలు చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రవీణ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా అక్రమ నిర్మాణాలను గుర్తించి నోటీసులు జారీచేసినా పట్టించుకోకుండా ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారని, ఇటీవల నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిన కథనానికి స్పందించి తాము కూల్చివేతలు చేపట్టామన్నారు. మున్సిపాలిటీ నుంచి పొందిన అనుమతులను అతిక్రమించి ఒక్కోచోట జీ ప్లస్ 7, 8, 9 అంతస్తుల నిర్మాణాలను కేవలం 250 గజాల స్థలంలోనే నిర్మించారని తెలిపారు. నిబంధనలను అతిక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టామని, త్వరలోనే అక్రమ నిర్మాణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కోకాపేటలోని 250 గజాల స్థలాల్లో (గోల్డెన్మైల్ కాలనీ) దాదాపు 30కి పైగానే అక్రమ నిర్మాణాలను గుర్తించామన్నారు. మొదటి రోజు ఒక భవనంలోని అదనపు అంతస్తులను కూల్చివేయడం జరిగిందన్నారు. మిగతా అక్రమ నిర్మాణాలను రోజువారీగా కూల్చివేసే ప్రక్రియను చేపట్టామన్నారు. అక్రమ నిర్మాణాల విషయంలో ఎంతటివారినైనా ఊపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టౌన్ప్లానింగ్ అధికారిణి హారిక, హెచ్ఎండీఏ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.