బహుదూర్పల్లి, తొర్రూర్లో హెచ్ఎండీఏ లేఅవుట్లలో ప్లాట్ల విక్రయం
రెండోదశలో మరిన్ని స్థలాలకు వేలం
నోటిఫికేషన్ జారీ.. ఈనెల 28 రిజిస్ట్రేషన్కు ఆఖరు
సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ): నగర శివారు ప్రాంతాలైన బహదూర్పల్లి, తొర్రూర్లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అభివృద్ధి చేసిన లేఅవుట్లలో రెండో విడత ప్లాట్లను వేలం వేసేందుకు మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. జూన్ 30వ తేదీన బహదూర్పల్లిలోని 51 ప్లాట్లకు, జూలై 1,2,4 తేదీల్లో తొర్రూర్లోని 148 ప్లాట్లకు ఆన్లైన్ వేలం వేయనున్నారు. ప్లాట్ల విక్రయాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎంఎస్టీసీ లిమిటెడ్ ఈ-ఆక్షన్ ద్వారా విక్రయించేలా ఏర్పాట్లు చేశారు.
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా పరిధిలోని బహదూర్పల్లిలో 40 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన లేఅవుట్లో మొత్తం 101 ప్లాట్లు ఉండగా, గతంలో 50 ప్లాట్లను మొదటి దశలో విక్రయించారు. రెండో దశలో మిగిలిన ప్లాట్లకు వేలం వేస్తున్నారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని తొర్రూర్లో 117 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న లేఅవుట్లో 223 ప్లాట్లను మొదటి దశలో విక్రయించగా, రెండో దశలో 148 ప్లాట్లను విక్రయించనున్నారు. ప్లాట్ల వేలానికి సంబంధించిన వివరాలతో నోటిఫికేషన్ జారీ చేసి, కొనుగోలు చేసే వారి పేర్ల నమోదు పక్రియ, ప్రీబిడ్ మీటింగ్స్, ఈఎండీల చెల్లింపుల ప్రక్రియను నెల రోజుల పాటు నిర్వహించి, నెలాఖరులో ఆన్లైన్ వేలం చేపట్టనున్నారు. బహదూర్పల్లి లేఅవుట్లో చదరపు గజానికి నిర్ధారించిన కనీస ధరను రూ.25,000గా, తొర్రూర్లో చదరపు గజానికి రూ.20,000గా నిర్ణయించారు. చదరపు గజానికి కనీస బిడ్ పెంపుదలను రూ.500ల చొప్పున పెంచాల్సి ఉంటుంది.