సిటీబ్యూరో, మార్చి 29(నమస్తే తెలంగాణ): భూ ఆక్రమణదారులపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఉక్కుపాదం మోపుతున్నది. ప్రభుత్వ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిని అడ్డుకుంటూ, భూముల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. మంగళవారం శంషాబాద్లో 50 ఎకరాల భూమిని కబ్జా చేయడాన్ని అడ్డుకున్న హెచ్ఎండీఏ అధికారులు, బుధవారం ఐటీ కారిడార్లోని నార్సింగిలో ఎంతో విలువైన భూమిని కబ్జాదారుల చెర నుంచి కాపాడారు. హెచ్ఎండీఏ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నార్సింగి రెవెన్యూ విలేజ్ పరిధిలో ప్రభుత్వ భూముల ఆక్రమణలను అడ్డుకున్నది. నార్సింగి విలేజ్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) అవసరాల కోసం హెచ్ఎండీఏ భూసేకరణ పథకం కింద సేకరించిన స్థలంపై ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించేందుకు ప్రయత్నించారు. దీన్ని గుర్తించిన హెచ్ఎండీఏ అధికారులు ఆ స్థలంలో ఏర్పాటు చేసిన కట్టడాలను ధ్వంసం చేశారు. నార్సింగి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 189, 205 పరిధిలోని ఎకరా 0.03 గుంటల స్థలాన్ని ఆక్రమించుకోవడానికి కొందరు ప్రైవేటు వ్యక్తులు ప్రయత్నించడంతో హెచ్ఎండీఏ రెవెన్యూ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ యంత్రాంగం కలిసి కూల్చివేత చర్యలు చేపట్టారు. కబ్జాకు గురైన స్థలాన్ని హెచ్ఎండీఏ ఆధీనంలోకి తీసుకున్నారు.