సిటీబ్యూరో, సెప్టెంబర్ 29(నమస్తే తెలంగాణ): ఉప్పల్ భగాయత్ లే అవుట్లో అభివృద్ధి ఆరంభమైంది. ఒకప్పుడు మూసీ వెంబడి గడ్డి భూములుగా ఉన్న ప్రాంతమంతా ఇప్పుడు ఆకాశహార్మ్యాలకు కేంద్రంగా మారుతోంది. రామంతాపూర్ నుంచి మొదలు కొని ఉప్పల్ మీదుగా పీర్జాదిగూడ వరకు ఉన్న మూసీ తీర ప్రాంతమైన ఉప్పల్ భగాయత్లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) 476 ఎకరాల్లో రెండు దశల్లో చేపట్టిన లేఅవుట్లో ఇప్పుడు భారీ ఎత్తున నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ వెస్ట్ జోన్ (ఐటీ కారిడార్) తరహాలో ఈస్ట్జోన్గా ఉన్న ఉప్పల్ ప్రాంతంలోనూ 30 అంతస్తుల ఆకాశహర్మ్యం నిర్మాణానికి ఓ రియల్ ఎస్టేట్ సంస్థ దరఖాస్తు చేసుకుంది. దీంతో ఉప్పల్ భగాయత్ లేఅవుట్ ఆధునిక నిర్మాణాలకు, హైరైజ్ భవనాలకు నిలయంగా మారనుంది.
మూసీ వెంబడి ఉప్పల్ వైపు ఉన్న 700 ఎకరాల భూములను అప్పటి ప్రభుత్వం సేకరించగా, అందులో మెట్రో రైలు ప్రాజెక్టు కోసం 150 ఎకరాలు, జలమండలికి మరో వంద ఎకరాలను కేటాయించగా మిగిలిన భూములు 404 ఎకరాల్లో ఒక లేఅవుట్ను, మరో 72 ఎకరాల్లో మల్టీపుల్ యూజ్ జోన్ కింద భారీ లేఅవుట్లను హెచ్ఎండీఏ అన్ని రకాల మౌలికవసతులతో అభివృద్ధి చేసింది. భూములను ఇచ్చిన రైతులకు ఎకరాకు 1000 గజాల చొప్పున కేటాయించగా, మిగిలిన ప్లాట్లను 2018, 2019 ప్రాంతాల్లో ఆన్లైన్లో వేలం ద్వారా విక్రయించింది. సుమారు 1594 ప్లాట్లు ఉండగా, 9.4 లక్షల చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మాణాలు, రోడ్లు, పార్కులు, ఇతర మౌలిక వసతులకు 150కి పైగా ఎకరాలు కేటాయించారు.
నగరానికి వెస్ట్జోన్గా ఉన్న మాదాపూర్, గచ్చిబౌలి, కోకాపేట ప్రాంతాల్లోని ఐటీ కారిడార్ తరహాలో ఈస్ట్జోన్లో భాగంగా ఉన్న ఉప్పల్ ప్రాంతంలో అభివృద్ధి క్రమంగా పెరుగుతోంది. ఐటీ కంపెనీలతో పాటు ఇతర రియల్ ఎస్టేట్ సంస్థలు ఇక్కడ నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా ప్రత్యేకంగా పాలసీని తీసుకురావడంతో పలు కంపెనీలు ఉప్పల్ ప్రాంతంలో పెట్టుబడులు భారీగా పెడుతున్నాయి. ప్రజా రవాణా వ్యవస్థ పరంగానూ ఉప్పల్కు ఎంతో ప్రాధాన్యత నెలకొంది. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైలు డిపో, కమాండ్ కంట్రోల్ సెంటర్, నాగోల్, ఉప్పల్ మెట్రో స్టేషన్లు ఉప్పల్ భగాయత్ లే అవుట్లో భాగంగానే ఉన్నాయి. దీంతో పెట్టుబడులకు ఆకర్షణీయమైన ప్రాంతంగా మారింది.
ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో భాగంగా మెట్రో రైలు డిపో పక్కన రామంతాపూర్ను ఆనుకొని సుమారు 72 ఎకరాల్లో చేసిన లేఅవుట్ను పూర్తిగా మల్టీపుల్ యూజ్ జోన్గా పరిగణించి అభివృద్ధి చేశారు. ఇందులో ఒక్కోప్లాట్ విస్తీర్ణం 2వేల గజాల నుంచి 4వేల గజాల వరకు ఉంది. ఇక్కడ 15 నుంచి 30 అంతస్తులకు పైగా హైరైజ్ భవనాలను నిర్మించేందుకు అవకాశం ఉండటంతో పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకొచ్చాయి. వాసవి రియల్ ఎస్టేట్ సంస్థ ఇప్పటికే 15 అంతస్తులతో ఒక భవనాన్ని నిర్మించేందుకు అనుమతి తీసుకోగా, డీమార్ట్ సంస్థ 4వేల గజాల స్థలంలో భారీ నిర్మాణం చేపడుతోంది.
తాజాగా ఒకేసారి 30 అంతస్తులతో హైరైజ్ భవనాన్ని నిర్మించేందుకు ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ముందుకువచ్చినట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ఇక్కడ రోడ్ల విస్తీర్ణం 100, 80 అడుగుల్లో ఉండటంతో హైరైజ్ భవనాలను నిర్మించేందుకు పలు రియల్ ఎస్టేట్ సంస్థలు నిర్మాణాలు చేపట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఐటీ, ఐటీ ఆధారిత సేవలు అందించే జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రభుత్వం లుక్ ఈస్ట్ పాలసీని ప్రవేశపెట్టింది.