సిటీబ్యూరో, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ)/బండ్లగూడ : ఇటీవల కురుస్తున్న వర్షాలతో హిమాయత్సాగర్లోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. జలమండలి అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువ మూసీలోకి వదిలారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహం పెరగడంతో మంగళవారం ఉదయం 11.30 గంటలకు రెండు గేట్లను ఒక అడుగు పైకి ఎత్తి దిగువనున్న మూసీ నదిలోని నీటిని వదిలారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో ప్రవాహం మరింత పెరిగింది. దీంతో రెండు గేట్లను రెండు అడుగుల వరకు ఎత్తి 1400 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు.
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మూసీనది లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఎండీ దానకిశోర్ తెలిపారు. బోర్డు సిబ్బంది మూసీ నదికి ఇరువైపులా ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని, ప్రజలెవరూ అటువైపుగా వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. మరో రెండు రోజులు వర్షాలు పడే సూచనలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపిందని, పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లను, అధికార యంత్రాంగంతో పాటు జీహెచ్ఎంసీ, పోలీస్ అధికారులను అప్రమత్తం చేశారు.