సిటీబ్యూరో, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ ) : ఎగువ ప్రాంతాల నుంచి హిమాయత్సాగర్లోకి వస్తున్న వరద నీటి ప్రవాహం కొనసాగుతున్నది. విస్తారంగా కురుస్తున్న వానలతో జలాశయం నిండుకుండలా మారింది. మంగళవారం రెండు గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి దిగువ మూసీలోకి నీటిని వదిలిన అధికారులు, బుధవారం ముందస్తు జాగ్రత్తగా మరో రెండు గేట్లను ఒక అడుగు మేరకు ఎత్తి వరద నీటిని మూసీలోకి వదిలారు. హియాయత్సాగర్లోకి 800 క్యూసెక్కుల నీరు వస్తుండగా, నాలుగు గేట్ల ద్వారా దిగువకు 2100 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా ముందు జాగ్రత్తగా మూసీ నది లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఎండీ దానకిశోర్ తెలిపారు. బోర్డు సిబ్బంది మూసీ నదికి ఇరువైపులా ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని, ప్రజలెవరూ అటువైపుగా వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. కాగా జంట జలాశయాలు ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ రిజర్వాయర్లు నిండుకుండలా మారడంతో పర్యాటకుల సందడి నెలకొంది.