హైదరాబాద్, మే 6(నమస్తే తెలంగాణ): ఓక్రిడ్జ్ పాఠశాలలో స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలను ఇటీవల నిర్వహించారు. ఈ ఎన్నికల్లో హిమాన్షు రావు కల్వకుంట్ల క్రియేటివ్ యాక్షన్ సర్వీస్ (సీఏఎస్) ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. క్యాంపులు నిర్వహించి, నిధులు సమీకరించి తుఫానులు, వరదలు వచ్చిన ప్రాంతాల్లో సీఏఎస్ ద్వారా సేవా కార్యక్రమాలను చేపడుతారు. ఈ బృందానికి హిమాన్షు రావు ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రతి ఏటా స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించడం అనవాయితీ. ఈ ఏడాది నిర్వహించిన ఎన్నికల్లో ఇంటర్నేషనల్ బకలారియేట్ డిప్లమా ప్రొగ్రాం (International Baccalaureate Diploma Program) ఫస్టియర్ చదువుతున్న హిమాన్షు సైతం పోటీ చేశారు.
హిమాన్షుతో పాటు స్కూల్ కెప్టెన్గా కె.వీరారెడ్డి, స్టూడెంట్ కౌన్సిల్ ప్రెసిడెంట్స్గా ఆనన్య ఆనంద్ వాస్కర్, ఆశిష్ గొట్టుముక్కల ఎన్నికయ్యారు. తొలుత నామినేషన్లు వేసిన విద్యార్థులను ఇంటర్వ్యూ చేసిన ఎన్నికల ప్యానెల్ చివరికి కొందరిని పోటీకి ఎంపిక చేసింది. పోటీలో ఉన్న విద్యార్థులంతా ఓపెన్ ఫోరమ్లో తమకు ఎందుకు ఓటు వేయాలో విద్యార్థులకు వివరించారు. ఓట్లను లెక్కించిన పాఠశాల యాజమాన్యం స్కూల్ స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికల ఫలితాలను ఇటీవలే ప్రకటించింది. శుక్రవారం గెలుపొందిన స్టూడెంట్ కౌన్సిల్ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ హేమ చెన్నుపాటి, హిమాన్షుతో పాటు, కౌన్సిల్కు ఎన్నికైన సభ్యులను అభినందించారు.