సిటీబ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ): రుతుపవనాల ప్రభావంతో గత నాలుగు రోజులుగా గ్రేటర్లో వానలు విస్తారంగా కురుస్తున్నాయి. సోమవారం సాయంత్రం 6 గంటల వరకు శివరాంపల్లిలో అత్యధికంగా 6.53 సెం.మీలు, రాజేంద్రనగర్లో 5.0 సెం.మీలు, శాస్త్రిపురంలో 4.0 సెం.మీలు, బహుదూర్పురా, సులేమాన్నగర్లో 2.58 సెం.మీలు, పాతబస్తీ బండ్లగూడ, బార్కాస్ ప్రాంతాల్లో 1.80 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంపై రుతుపవనాలు చురుకుగా కదులుతుండడంతో రాగల మరో రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కాగా, నగరంలో ఉదయం నుంచి రాత్రి వరకు గరిష్ఠం 31.6, కనిష్ఠం 24.0 డిగ్రీలు, గాలిలో తేమ 75శాతంగా నమోదైనట్లు అధికారులు వివరించారు.