అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతకు అండ
బర్తరఫ్ డిమాండ్కు బదులు బహిరంగంగా మద్దతు
ఏదో మతలబు ఉందంటున్న రాజకీయ విశ్లేషకులు
హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): సాధారణంగా ప్రతిపక్షాలు ప్రభుత్వం ఎక్కడ దొరుకుతుందా? దుమ్మెత్తి పోద్దామా.. అని ఎదురుచూస్తుంటాయి. మంత్రులో, కీలక నేతలో ఏదైనా తప్పు చేస్తూ దొరికిపోతే ప్రెస్మీట్లు, విమర్శలు, ధర్నాలు, రాస్తారోకోలతో దద్దరిల్లేలా చేస్తాయి. సదరు నేత లేదా మంత్రిని బర్తరఫ్ చేయాలని, కఠినంగా శిక్షించాలంటూ నానా యాగీ చేస్తాయి. ప్రభుత్వం స్పందించేదాకా ఇరుకున పెడుతూనే ఉం టాయి. కానీ, మాజీమంత్రి ఈటల రాజేందర్ అంశంలో ప్రతిపక్షాల తీరు చాలా విడ్డూరంగా కనిపిస్తున్నది. ఏకంగా క్యాబినెట్ మంత్రిపై భూకబ్జా ఆరోపణలు వచ్చాయి. మంత్రి తమ భూములను అక్రమంగా గుంజుకున్నారంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాశారు. వాస్తవానికి ఇది ప్రతిపక్షాలకు ఒక సువర్ణావకాశం. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రిపై, ప్రభుత్వంపై విమర్శల దాడి చేయాలి. ఆయనను బర్తరఫ్చేయాలని డిమాండ్చేస్తూ ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేయాలి. రాష్ట్రంలో ప్రతిపక్షాలు మాత్రం రాస్తారోకోలకు బదులు ఈటల మెప్పుకోసం పాట్లు పడుతున్నాయి.
ప్రతిపక్షాలా? అవినీతికి కాపలాదారులా?
విపక్షాలు.. ఈటలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాల్సింది పోయి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికే అండగా నిలబడుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ను వాస్తవానికి ప్రతిపక్షాలు అభినందించాలి. కానీ, ‘అ య్ అట్లెట్ల చర్యలు తీసుకుంటరు’ అంటూ సీఎం కేసీఆర్నే నిందిస్తున్నాయి. ఈ విచిత్రవైఖరి చూసి తెలంగాణ ప్రజలు నోరెళ్లబెడుతున్నారు. వీళ్లు నిజంగానే ప్రతిపక్ష నేతలా? లేదా అవినీతికి కాపలాదారులా? ఇద్దరి నడుమ ఏ చీకటి ఒప్పందం జరిగింది అన్న సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. ఈటల రాజేందర్ను ముఖ్యమంత్రిగా ఎందుకు చేయరు? అంటూ ఇటీవల కొందరు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ను ప్రశ్నించారు. నాలుగు రోజులైనా గడువకముందే ఆయనపై అవినీతి ఆరోపణలు వస్తే.. కబ్జాలు నిజమని తేలినా వెనుకేసుకొస్తున్నారు. దీనినిబట్టి ఇదంతా ముందస్తు ప్రణాళికలో భాగంగా జరుగుతున్నదే అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. సొంతపార్టీ నేతను కాపాడుకుంటున్నట్టు ఈటలను వెనుకేసుకురావడం పట్ల ఏదో మతలబు ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు. ఆయన టీఆర్ఎస్లో ఉంటూనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సభ్యత్వం ఏమన్నా తీసుకున్నాడా? అని అనుమానపడుతున్నారు. ఎక్కడైనా అన్యా యం జరిగిందని ఆరోపణ వస్తే భావిస్తే ప్రతిపక్ష నేతలు అక్కడ వాలిపోతుంటారు. బాధితులకు సంఘీభావం ప్రకటిస్తారు. మరి అసైన్డ్ భూమిని కబ్జా చేసినట్టు తేలినా ప్రతిపక్ష నేతలు ఒక్కరైనా మాసాయిపేట మండలంవైపు చూసిన దాఖలాలు లేవు. ‘చలో అచ్చంపేట’ అనో.. ‘చలో హకీంపేట’ అనో పిలుపునిచ్చిన నాథుడే లేడు.