హైదరాబాద్ సిటీబ్యూరో/ఖైరతాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): తనను యూ బెగ్గర్ అంటూ ప్రతిరోజూ తన తాత జనార్దన్రావు అవమానించేవాడని పారిశ్రామిక వేత్త చంద్రశేఖర జనార్ధన్రావు హత్య కేసు నిందితుడు, ఆయన మనుమడు కీర్తితేజ ఆరోపించాడు. ఏరోజూ తనను సొంత మనిషిగా చూడలేదని, అందరి కంటే హీనంగా చూస్తూ దారుణంగా వ్యవహరించేవాడని, అందుకే తాతను హత్య చేశానని పోలీసుల విచారణలో చెప్పాడు. ఐదు రోజుల పాటు కీర్తి తేజను పోలీస్ కస్టడీలో హత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు ప్రశ్నించారు. సోమవారంతో కీర్తితేజ పోలీస్ కస్టడీ ముగిసింది. కీర్తితేజ తన తాతను హత్య చేసిన విధానం, ఎందుకు చేశాడో పంజాగుట్ట పోలీసులకు వివరించారు. సీఐ శోభన్ తెలిపిన వివరాల ప్రకారం తన తాత తనను కుటుంబంలో ఒక సభ్యుడుగా తనను ఎప్పుడూ చూసేవాడు కాదన్నాడు.
ప్రతీరోజూ తనను బెగ్గర్ అంటూ సంబోదించడమే కాకుండా ఆఫీసుకు వెళ్తే అక్కడ కూడా అవమానించేవారని కీర్తి తేజ చెప్పాడు. దీంతో స్టాఫ్ కూడా తనను చిన్నచూపు చూసేవారంటూ తెలిపాడు. ఆస్తి పంపకాలు పదవుల కేటాయింపుల్లోనూ తనను తక్కువ చేశాడని, చివరకు డైరెక్టర్ పదవి కూడా జనార్దన్రావు రెండవ కుమార్తె కొడుకుకు ఇచ్ఛాడని, అప్పటినుంచి తనకు, తాతకు మధ్య గొడవలు పెరిగాయని చెప్పాడు. అందుకే తాతను చంపేయాలని నిర్ణయించుకుని ప్లాన్ చేసుకున్నానని, అందులో భాగంగా ఇన్స్టామార్ట్ నుంచి కత్తి కొనుగోలు చేశానని చెప్పాడు.
హత్య జరిగిన రోజు తనకు తాతకు మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగిందని, తనకు వాటా కావాలని అడిగితే ఇయ్యను పొమ్మనడంతో కోపంతో కత్తితో కసితీరా పొడిచి చంపేసి తర్వాత అక్కడినుంచి పారిపోయానని కీర్తి తేజ తెలిపాడు. హత్య చేసిన తర్వాత బిఎస్మక్తా ఎల్లమ్మగూడ పక్కనే ఖాళీ స్థలంలో కత్తి, రక్తంతో కూడిన బట్టలను తగులబెట్టానని వివరించాడు. అయితే మంటల్లో కత్తి కాలిపోకుండా అలాగే ఉండడంతో పోలీసులు ఆ కత్తిని స్వాధీనం చేసుకున్నారు. మొదటిరోజు విచారణలో కీర్తితేజ పోలీసులకు సహకరించలేదు.
జనార్ధన్రావును ఎందుకు హత్య చేశావంటూ పోలీసులు ఎంత ప్రశ్నించినా నోరు మెదపలేదు. ఘటనాస్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్కు ప్రయత్నిస్తే కీర్తి తేజ సహకరించలేదు. ఏ ప్రశ్న అడిగినా నేల చూపులు చూసేవాడని పోలీసులు చెప్పారు. రెండవరోజు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. అప్పటినుంచి విచారణ వేగవంతమైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని విచారణ అనంతరం చంచల్గూడ జైలుకు తరలించినట్లు పోలీసులు చెప్పారు.