మేడ్చల్, జూన్10(నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో సుపరిపాలన పరుగులు తీస్తుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో శనివారం సుపరిపాల దినోత్సవంలో జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి, కలెక్టర్ అమోయ్కుమార్తో కలిసి మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో సుపరిపాలన సాధ్యపడుతుందన్నారు. 2016లో ఏర్పాటైన మేడ్చల్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి నెంబర్వన్ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. జిల్లాతో పాటు నూతనంగా కీసర రెవెన్యూ డివిజన్ తొమ్మిది మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లు ఏర్పాడి ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాడ్డయన్నారు. అంతేకాక జిల్లా అధికారులు ఒకే చోట ఉండాలని సమీకృత నూతన కలెక్టరేట్ను నిర్మించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందన్నారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్య, డీసీపీ జానకి, సీఈవో దేవసహాయం, మేయర్లు జక్క వెంకట్రెడ్డి, కావ్య, మున్సిపాలిటీ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.