సిటీబ్యూరో, మార్చి 30 (నమస్తే తెలంగాణ) : డేటా చోరీ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. వివిధ రకాల సంస్థలు, వ్యవస్థలు, వ్యక్తులకు సంబంధించిన డేటాను చోరీ చేయడంతో పాటు వాటిని ఇతర సంస్థలు, వ్యక్తులకు విక్రయించే క్రమంలో పెద్ద ఎత్తున హవాలా ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగి, డేటా చోరీ కేసుపై దృష్టి సారించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ పోలీసుల ద్వారా సేకరిస్తున్నట్లు సమచాచారం.
మరో పక్క సైబరాబాద్ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) డేటాను నిందితులకు లీక్ చేసిన సంస్థలు, వ్యక్తులపై ఆరా తీసినట్లు తెలిసింది. 5రోజుల కస్టడీలో భాగంగా ప్రధాన నిందితులైన నితీశ్ భూషణ్, సుశీల్ తోమర్, అతుల్ ప్రతీప్సింగ్, సందీప్పాల్, జియా ఉర్ రహమాన్లను మూడో రోజు సిట్ అధికారులు విచారించారు. బ్యాంక్ ఆప్ బరోడా, ఎస్బీఐ వంటి ప్రభుత్వ రంగ బ్యాంక్లతో పాటు యాక్సెస్, హెచ్డీఎఫ్సీ తదితర ప్రైవేటు బ్యాంకుల నుంచి నిందితులకు డేటా వచ్చినట్లు తేలడంతో ఆయా సంస్థల నుంచి డేటా లీక్కు పాల్పడింది ఎవరు? వారికి ఎంత మొత్తంలో డబ్బులు చెల్లించారు ? డేటాను ఏయే పద్ధతిలో నిందితులకు చేరింది తదితర అంశాలపై సిట్ అధికారులు కూపీ లాగినట్లు సమాచారం.
డేటా నేరుగా ఆయా సంస్థల నుంచి నేరస్తులకు చేరిందా లేక వేర్వేరు మార్గాల ద్వారా చేరిందా అనే కోణంలో కూడా అధికారులు నిందితులను విచారిస్తున్నట్లు తెలిసింది. డేటా చోరీ ముఠా వెనక ఇంకా ఎంత మంది ఉన్నారు, ఏయే సంస్థలు పనిచేస్తున్నాయి తదితర ప్రశ్నలను అధికారులు సంధించినట్లు తెలిసిది. డేటా చోరీలో జరిగిన క్రయ, విక్రయాల్లో జరిగిన ఆర్థిక లావాదేవీలపై సిట్ అధికారులు లోతుగా విచారిస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలు తాజాగా కేసు కూడా నమోదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.