మేడ్చల్, డిసెంబర్ 10: పింఛన్ కోసం వచ్చిన ఓ మహిళను మేడ్చల్ ఏటీవో వేధించారని ఆరోపణ రావడంతో డీటీవో విచారణ జరిపారు. మేడ్చల్లోని ఎస్టీవో కార్యాలయంలో శుక్రవారం డీటీవో నర్సింహ, సబ్ ట్రెజరీ ఆఫీసర్ కరుణాకర్రెడ్డి, సీనియర్ అకౌంటెంట్ తిరుమల్రెడ్డితో కలిసి విచారణ చేపట్టారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏటీవో పవన్కుమార్, బాధితురాలిని వేర్వేరుగా విచారించారు. అనంతరం డీటీవో నర్సింహ వివరాలు వెల్లడించారు. ఉద్యోగం చేసిన తండ్రి చనిపోవడంతో తల్లి లేని అతడి కూతురు మేడ్చల్ ట్రెజరీ కార్యాలయం ద్వారా 2014 అక్టోబర్ 26 నుంచి పింఛన్ తీసుకుంటున్నది. నిబంధనల ప్రకారం పెండ్లి అయ్యేంత వరకే పింఛన్ తీసుకోవాల్సి ఉండగా, ఆమె వివాహం అనంతరం కూడా అదనంగా రూ. 1,47,031లు తీసుకుంది. దీంతో ఈ డబ్బులు తిరిగి చెల్లించాలని నోటీసులు జారీ చేశారు.
ఈ క్రమంలో సదరు మహిళ గతనెల నవంబర్లో మేడ్చల్ ఎస్టీవో కార్యాలయానికి వచ్చింది. తాను భర్తతో ఈ ఏడాది జనవరిలో కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నానంటూ..పత్రాలు చూపించి.. మళ్లీ పింఛన్ ఇవ్వాలని ఏటీవో పవన్కుమార్ను సంప్రదించింది. అయితే సినిమాకు వస్తే పని చేసి పెడుతానని.. ఏటీవో వేధించాడని సదరు మహిళ ఆరోపించినట్లు డీటీవో తెలిపారు. బాధితురాలి ఆరోపణపై ఏటీవోను విచారించగా, అదనంగా పొందిన పింఛన్ డబ్బులు తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని చెప్పినందుకే.. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నట్లు వివరణ ఇచ్చారని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి నివేదికను డీటీఏకు అందిస్తామని డీటీవో తెలిపారు.