సిటీబ్యూరో/అబిడ్స్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): చారిత్రక నేపథ్యం ఉన్న గన్ఫౌండ్రి ఒకప్పుడు ఆయుధకారాగారం ఉండేది. నిజాం నవాబుల కాలంలో సైనికులకు అవసరమైన ఫిరంగులను ఇక్కడే తయారు చేసేవారు. 1795 సంవత్సరం అసఫ్జాహీల కాలంలో తోప్లు, రైఫిళ్లు తయారు చేసేందుకు ఏకంగా మాన్సియర్ రేమండ్ ఈ పరిశ్రమను ఏర్పాటు చేశారు. ఇటుక బట్టీల మాదిరిగా పరిశ్రమ గోడలను నిర్మించారు. అంతేకాక ఈ ప్రాంతాన్ని తోప్ కా సంచా, తోప్ కా భట్టీ పేర్లతో పిలుచుకునేవారు. కాలక్రమేణా ఈ పరిశ్రమ కనుమరుగైంది. కానీ ఆ పరిశ్రమ పేరుతో ఈ ప్రాంతాన్ని ఇప్పటికీ గన్ఫౌండ్రిగానే పిలుస్తున్నారు. ప్రస్తుతం గోషామహల్ నియోజకవర్గంలో గన్ఫౌండ్రి డివిజన్గా కొనసాగుతున్నది. గన్ఫౌండ్రిలో అనేక చారిత్రక కట్టడాలు ఉన్నాయి. నిజాం, మహబూబియా కళాశాలలు ఈ ప్రాంతంలో నేటికీ కొనసాగుతున్నాయి. తెలంగాణ హెరిటేజ్ విభాగం అధికారులు గన్ఫౌండ్రిని చారిత్రక ప్రాంతంగా గుర్తిస్తూ బోర్డును సైతం ఏర్పాటు చేశారు. అప్పటి పరిశ్రమ ఉన్న ప్రాంతం, ఆనాటి కట్టడాలు చెక్కు చెదరకుండా ప్రభుత్వం, పురావస్తు శాఖ కృషి చేస్తుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.