సిటీబ్యూరో, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని రకాల బస్ స్టేషన్లను అభివృద్ధి చేయడంపై ఆర్టీసీ యాజమాన్యం దృష్టి సారించింది. నగరంలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందన్నారు. ప్రయాణికుల పెరుగుదలకు అనుగుణంగా బస్స్టేషన్లలో వసతి సదుపాయాలు మెరుగుపరుచడం పై ఆర్టీసీ అధికారులు దృష్టి పెట్టారు. అందులో భాగంగా ప్రయాణికుల కోసం అన్ని రకాల ప్రధాన బస్ స్టేషన్లలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. అన్ని రకాల హంగులతో బస్స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈసీఐఎల్, పటాన్చెరు వంటి బస్స్టేషన్లను అన్ని రకాల సౌకర్యాలతో అభివృద్ధి చేసినట్లు సికింద్రాబాద్ ప్రాంతీయ అధికారి సీహెచ్ వెంకన్న తెలిపారు. బస్సుల కోసం వేచివుండే ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా.. ముఖ్యంగా ఉద్యోగులు, వ్యాపారస్తులు, మహిళలను దృష్టిలో పెట్టుకుని మరుగుదొడ్లను కూడా ఆధునీకరిస్తున్నారు. మరుగుదొడ్లను హైటెక్ లుక్ వచ్చే విధంగా ఆధునీకరిస్తున్నారు. త్వరలో మరికొన్ని బస్స్టేషన్లను గుర్తించి వాటిని కూడా దశల వారీగా పునరాభివృద్ధి చేస్తామని, ఇందుకోసం ఆర్టీసీ యాజమాన్యం ఎప్పటికప్పుడు అవసరమైన నిధులు కూడా విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
త్వరలో ఉప్పల్ బస్స్టేషన్ అభివృద్ధి..
ఉప్పల్ బస్స్టేషన్కు ప్రయాణికుల రద్దీ రోజురోజుకు పెరుగుతున్నది. ప్రస్తుతం ఉన్న బస్స్టేషన్ ప్రయాణికుల అవసరాలు తీర్చే విధంగా లేదని అధికారులు గుర్తించారు. కాగా, ఉప్పల్ మార్గంలో ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులు నిర్మాణంలో ఉన్నాయి. ఈ పనులు పూర్తయిన తర్వాత ఉప్పల్ బస్స్టేషన్ను అభివృద్ధి చేస్తామని ఆర్ఎం తెలిపారు.