మహానగరానికి మరో ఖ్యాతి లభించింది. జలవనరుల శుభ్రతతోపాటు గ్రేటర్వ్యాప్తంగా గృహాలు, వాణిజ్య సముదాయాల నుంచి వచ్చే మురుగు జలాలను శుద్ధి చేసి పునర్వినియోగం చేస్తున్నందుకు వాటర్ ప్లస్ గుర్తింపు లభించింది. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రకటించింది. జీహెచ్ఎంసీ ప్రతిపాదన మేరకు స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా కేంద్ర అధికారుల బృందం జూలై 31 నుంచి ఈనెల 13వ తేదీ వరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి మురుగునీటి నిర్వహణ, శుద్ధి ప్రక్రియలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటర్ప్లస్ గుర్తింపునకు సిఫార్సు చేసింది.
జలమండలి,హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో గ్రేటర్వ్యాప్తంగా 28 మురుగునీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీలు) పనిచేస్తున్నాయి. వీటిల్లో నిత్యం సుమారు 772 ఎంఎల్డీల మురుగు జలాలను శుద్ధి చేసి దిగువనకు వదులుతారు. ఇలా శుద్ధయిన నీటిని పార్కులు, గార్డెనింగ్లు, నర్సరీలు, టాయిలెట్ల నిర్వహణకు వినియోగిస్తున్నారు. మూసీ పరీవాహకంలో కొన్నిచోట్ల వ్యవసాయానికి వాడుతున్నారు. హైదరాబాద్కు వాటర్ప్లస్ గుర్తింపు రావడంపై బల్దియా మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత హర్షం వ్యక్తం చేశారు.
వాటర్ప్లస్ హోదా రావాలంటే జలవనరులను శుభ్రంగా ఉంచాలి. గృహాలు, వాణిజ్య సముదాయాల నుంచి విడుదలయ్యే మురుగును శుద్ధి చేసిన తర్వాతే విడుదల చేయాలి. ఇలా పక్కాగా చేస్తున్న నగరాలకే వాటర్ప్లస్ గుర్తింపు ఇస్తారు. దేశంలో 8 ముఖ్యనగరాల్లో ఎక్కడాలేని విధంగా నగరంలో 96 శాతం వరకు శుద్ధి చేసిన మురుగునీటిని తిరిగి వినియోగిస్తుండడం విశేషం.
స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్)లో మెరుగైన ఫలితాలు రాబట్టిన హైదరాబాద్ మహానగరం మరో ఘనతను సాధించింది. గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని వాటర్ ప్లస్ నగరంగా గుర్తిస్తూ కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ప్రకటించింది. స్వచ్ఛ నగరాల జాబితాలో ఈ పురస్కారం ఎంతో ప్రతిష్టాత్మకమైనది. 2014లో ప్రారంభమైన స్వచ్ఛ భారత్ మిషన్ ఇప్పటికే హైదరాబాద్ను ఓడీఎఫ్++ నగరంగా కూడా ప్రకటించింది.
జలమండలి, హెచ్ఎండీఏ సహకారంతో ఈ వాటర్ ప్లస్ గుర్తింపును హైదరాబాద్ సాధించింది. జలమండలి ఆధ్వర్యంలో 25 సివరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీలు), హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో మరో మూడు ఎస్టీపీలు నిర్వహణలో ఉన్నాయి. నివాసాలు, వాణిజ్య ప్రాంతాల నుంచి విడుదలయ్యే దాదాపు 772 ఎంఎల్డీ వ్యర్థ జలాలను ఈ ఎస్టీపీలలో శుద్ధి చేస్తారు. ఇలా శుద్ధి అయిన జలాలను పార్కులు, రోడ్లు, నర్సరీలు, టాయిలెట్ల నిర్వహణతో
పాటు వ్యవసాయ అవసరాలకు కూడా ఉపయోగిస్తున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్కు వాటర్ ప్లస్ గుర్తింపు రావడంపై నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డిలు హర్షం వ్యక్తం చేశారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్లోనే 96 శాతం మేర శుద్ధి చేసిన మురుగునీటిని తిరిగి వాడుతున్నారు. తాగడానికి మినహాయిస్తే ఇతర అవసరాలకు వినియోగించాలని నిర్ణయించిన జలమండలి ఇందుకోసం పక్కా ప్రణాళికలు తయారు చేసింది. భారీ నివాస సముదాయాలు, గార్డెనింగ్, బాత్రూంలు, రైల్వేలు, పరిశ్రమలకు అతి తక్కువ ధరకే నీటిని జలమండలి అధికారులు అందిస్తున్నారు. ముఖ్యంగా గార్డెనింగ్ కోసం ఈ నీటిని ఎక్కువగా వినియోగిస్తుండటం విశేషం. అన్నింటికంటే ముఖ్యంగా హైదరాబాద్ నుంచి నల్లగొండ మూసీ దిగువ ప్రాంతాల రైతులు తమ వ్యవసాయ పనులకు ఈ నీటిని వినియోగిస్తుండటం గమనార్హం.
నల్ల చెరువు, పెద్ద చెరువు, సఫిల్గూడ, మిరాలం-1, ఖాజాగూడ, దుర్గం చెరువు, అత్తాపూర్-1, నాగోల్, సరూర్నగర్, అంబర్పేట ఎస్టీపీల వద్ద ప్రత్యేకంగా అధికారులు ఫిల్లింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ట్యాంకర్ల ద్వారా ఆయా ప్రాంతాలకు నీటిని తరలించి వినియోగిస్తున్నారు. వీటితో పాటు ఎస్ఆర్డీపీ, సీఆర్ఎంపీ పనులకు, ఫుట్పాత్ విస్తరణ, పబ్లిక్ టాయిలెట్లకు ఈ నీటిని వినియోగిస్తున్నారు.వాటర్ ప్లస్ నగరంగా హైదరాబాద్ గుర్తింపు నీటి పునర్వినియోగంపై ప్రతిష్ఠాత్మక పురస్కారం హర్షం వ్యక్తం చేసిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్రెడ్డి
దేశంలో ఏ ముఖ్యమైన నగరాల్లో లేని విధంగా హైదరాబాద్ నగరంలో జలమండలి ఆధ్వర్యంలో మురుగునీటి శుద్ధి ప్రక్రియ జరుగుతుంది. నిత్యం ఉత్పత్తి అవుతున్న మురుగునీటిలో 96 శాతం మేర శుద్ధి చేసి మూసీలోకి వదులుతున్నాం. శుద్ధి అయిన మురుగునీటిని గార్డెనింగ్, నర్సరీలు, పార్కుల నిర్వహణకు వాడుతున్నాం. అన్నింటి కంటే ప్రధానంగా మూసీ దిగువ ప్రాంతాల రైతులకు ఈ నీరు ఎంతగానో దోహదపడుతుంది. సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మార్గదర్శకంలో మురుగునీటి శుద్ధి నిర్వహణలో సంస్కరణలు చేపట్టాం. ఎస్టీపీల నిర్వహణను ఐదేండ్ల పాటు ఒకే ఏజెన్సీకి అప్పగించి నిరంతరం ఆన్లైన్ ద్వారా పర్యవేక్షిస్తూ శుద్ధి ప్రక్రియను గమనిస్తున్నాం. సంస్థ పరంగా మురుగునీటి వ్యవస్థ విభాగాన్ని బలోపేతం చేశాం. ఎస్టీపీలు, ఎఫ్ఎస్టీపీల నిర్వహణను ఆదర్శవంతంగా నిర్వహిస్తున్నాం. మురుగునీటి ఉత్పత్తికి తగ్గట్టుగా శుద్ధి జరగాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఇటీవల నూతనంగా 17 ఎస్టీపీలను ప్రారంభించాం. ఓఆర్ఆర్ గ్రామాల వరకు సివరేజీ వ్యవస్థను బలోపేతం చేయడం, మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా సివరేజీ మాస్టర్ ప్లాన్ (ఎస్ఎంపీ) ప్రణాళికను సిద్ధం చేసి కార్యరూపంలోకి తీసుకువస్తున్నాం.-దానకిశోర్, జలమండలి ఎండీ
హైదరాబాద్కు వాటర్ ప్లస్ హోదా ఇవ్వాలన్న జీహెచ్ఎంసీ ప్రతిపాదనలో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ బృందం ఈ ఏడాది జూలై 31 నుంచి ఆగస్టు 13 వరకు నగరంలోని వివిధ ప్రాంతాలలో పర్యటించింది. మురుగునీటి నిర్వహణ, శుద్ధి చేసిన నీటి పునర్వియోగం.. ఇలా సుమారు తొమ్మిది అంశాలలో మార్కులను కేటాయించింది. ఫీకల్ స్లడ్జ్, మానవ రహిత శుద్ధి, నిర్వహణలో సిబ్బందికి పీపీఈ, రక్షణ కిట్లు, ఎస్టీపీల వద్ద శుద్ధి ప్రక్రియ, రీ యూజ్ విధానం అమలు, ఎస్టీపీ, ఎఫ్ఎస్టీపీల నిర్వహణ, ఆపరేషన్స్, సివరేజీ లీకేజీలు, వాటర్ లాగింగ్, డ్రైనేజీ క్లీనింగ్ ఫిర్యాదులను పరిష్కరిస్తున్న తీరు.. ఇలా అనేక కేటగిరీల్లో పాస్ మార్కులు ఇచ్చి వాటర్ ప్లస్కు ఎంపిక చేశారు.