మలక్పేట, జనవరి 30: మలక్పేటలోని ప్రభుత్వ బధిరుల పాఠశాలపై వస్తున్న పుకార్లను నమ్మొద్దని,పాఠశాల యథావిధిగా ఇక్కడే కొనసాగుతుందని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, సంక్షేమశాఖ డైరెక్టర్ శైలజ స్పష్టం చేశారు. ఆస్మాన్ఘడ్లోని బధిరుల పాఠశాల, హాస్టల్ను, వికలాంగుల సంక్షేమశాఖ భవన్ ఆవరణలో నిర్మించనున్న నూతన భవనంలోకి మారుతుందనే పుకార్లతో పలు బధిరుల సంఘాల నాయకులు సోమవారం సంక్షేమ భవన్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో వారిని డైరెక్టర్ కార్యాలయానికి ఆహ్వానించిన చైర్మన్, డైరెక్టర్ వారితో కూలంకషంగా చర్చించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆస్మాన్ఘడ్ బధిర పాఠశాల,హాస్టల్లో సరైన వసతులు లేనికారణంగా వారికోసం సంక్షేమ భవన్ ఆవరణలో నూతన భవన నిర్మాణం చేపట్టి అప్పుడు ఈ స్కూల్ను అక్కడకు మారుస్తామని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో లేని బధిర విద్యార్థులకు మాత్రమే ఈ పాఠశాలలో ప్రవేశాల కల్పిస్తామని, జీహెచ్ఎంసీ పరిధిలోని వారికి మలక్పేట ప్రభుత్వ బధిరుల పాఠశాలలోనే చదువు కొనసాగుతుందని తెలిపారు. సంక్షేమ భవన్లో ఖాళీగా ఉన్న స్థలాన్ని చదునుచేసి పాఠశాల విద్యార్థుల క్రీడలకోసం కేటాయిస్తామని తెలిపారు. బధిర విద్యార్థుల డిగ్రీ కళాశాల కోసం ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపామని, దీనిపై ప్రభు త్వం కూడా సానుకూలంగా ఉందని వివరించటంతో వారు ఆందోళనను విరమించారు.