బంజారాహిల్స్, జూలై 31: మారుతున్న జీవనశైలితో పాటు మానసిక సమస్యలతో బాధపడేవారి సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకరమని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. భారతీయ మానసిక వైద్యుల సమాఖ్య తెలంగాణ చాఫ్టర్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్లోని తాజ్ కృష్ణా హోటల్లో ఏర్పాటు చేసిన ‘సైకథాన్-2021’ సదస్సును శనివారం గవర్నర్ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించి ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ..విపరీతంగా పెరిగిన ఇంటర్నెట్ వినియోగంతో పాటు పలు రకాలైన కారణాలతో తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారని, ఒత్తిడిని తగ్గించుకునే అవకాశాలు లేక మానసిక సమస్యలకు గురవుతున్నారన్నారు. మానసికంగా సమస్యలు ఎదుర్కొనేవారికి కుటుంబం అండగా నిలిస్తే త్వరగా కోలుకునే అవకాశం ఉందన్నారు. దేశంలోని పలు ప్రాంతాలనుంచి వచ్చిన 350మంది వైద్యులు, నిపుణులు నేరుగా పాల్గొంటున్నారని, 1250మంది వర్చువల్గా ఈ సదస్సులో పాల్గొంటున్నారని భారతీయ మానసిక వైద్యుల సమాఖ్య తెలంగాణ అధ్యక్షుడు డా.జగన్నాథ్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ చైర్మన్ ప్రసాద్రావు తదితరులు పాల్గొన్నారు.