సుల్తాన్బజార్, మార్చి 29: మానవ సేవే మాధవ సేవగా ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. ఆదివారం కోఠిలోని వైఎంఐఎస్ గ్రంథాలయ భవన్లో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన సేవా భారతి ఆధ్వర్యంలో డాక్టర్ హెడ్గేవార్ బ్లడ్ సెంటర్ను గవర్నర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రక్తదానం ఎంతో గొప్పదని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రక్తదానం చేసేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.
దేశంలో సేవా భారతి చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలపై అభినందనలు తెలిపారు. సేవా భారతికి తన వంతు సహాయ సహకారాలను అందించేందుకు కృషి చేస్తానన్నారు. దాతల సహకారంతో బ్లడ్ సెంటర్ను ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ బస్తీలు, మురికివాడల్లో నిరంతరం ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడంలో సేవా భారతి సంస్థ నిరంతరం ముందంజలో ఉండటం గొప్ప విషయమన్నారు.
ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ వంటి సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. బ్లడ్ సెంటర్ ఏర్పాటు చేసిన సేవా భారతి నిర్వాహకులు, సహకరించిన దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆర్ఎస్ఎస్ ఆలిండియా కార్యవర్గ సభ్యుడు సుహాస్రావు, రాష్ట్రీయ సేవా భారతి అధ్యక్షుడు సునీల్, అఖిల భారతీయ ధర్మ జాగరణ్ ప్రముఖ్ శ్యామ్ కుమార్, డీఆర్డీవో నేషనల్ సెక్యూరిటీ అడ్వైయిజరీ బోర్డ్ మాజీ చైర్మన్ డాక్టర్ సతీశ్రెడ్డి, తెలంగాణ సేవా భారతి అధ్యక్షుడు దుర్గారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఆర్ఎస్ఎస్ నాయకులు, సేవా భారతి సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.