దుండిగల్, ఆగస్టు 17: కుత్బుల్లాపూర్ రాజకీయపితామహుడు, స్వర్గీయ కేఎం పాండు కుత్బుల్లాపూర్కు అందించిన సేవలు మరువలేనివని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ బహదూర్పల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో స్థానిక శాసన సభ్యులు కేపీ.వివేకానంద్ తన తండ్రి కేఎం.పాండు పేరిట సొంత నిధులు రూ.1కోటి వెచ్చించి నూతనంగా నిర్మించిన కేఎం.పాండు మెమోరియల్ ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాల భవణాన్ని గురువారం కేఎం.పాండు 78వ జయంతిని పురస్కరించుకొని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, మల్కాజిగిరి ఎమ్మెల్యేలు కేపీ.వివేకానంద్, మాధవరం కృష్ణారావు, మైనంపల్లి హన్మంతరావుతో కలిసి మంత్రి మల్లారెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ కేఎం పాండు గౌడ్ కుత్బుల్లాపూర్ సర్పంచ్గా 20ఏండ్లు, మేడ్చల్ పంచాయతీరాజ్ సమితి వైస్ప్రెసిడెంట్గా, కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీ ప్రథమ చైర్మన్గా దాదాపు మూడు దశాబ్దాల పాటు ఇక్కడి ప్రజలకు సేవలు అందించారన్నారు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కుత్బుల్లాపూర్ను అద్భుతంగా అభివృద్ధి చేస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారని తెలిపారు.
ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, మెడికల్ కళాశాల తెచ్చిన ఘనత వివేకానంద్దే
ప్రభుత్వంతో మాట్లాడి నియోజకవర్గానికి ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలతో పాటు ప్రభుత్వ మెడికల్ కళాశాలను మంజూరు చేయించుకున్న ఘనత వివేకానంద్కే దక్కుతుందని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థికి ఇంటర్మీడియెట్ అనేది టర్నింగ్ పాయింట్ వంటిదని, ఈ రెండేండ్లు కష్టపడి చదివితే భవష్యత్లో ఉన్నత చదువులు చదివి, ఉత్తమ స్థానానికి చేరుకుంటారని అన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ఎమ్మెల్యే వివేకానంద్ తన సొంతఖర్చులతో పేద విద్యార్థులకు ఒకేషనల్ జూనియర్ కాలేజీ నిర్మించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో దుండిగల్ మున్సిపాలిటీ వైస్చైర్మన్ పద్మారావు, మాజీ జడ్పీ వైస్చైర్మన్ బొంగునూరి ప్రభాకర్రెడ్డి, మాజీ ఎంపీపీ చినంగి వెంకటేశం, కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్రెడ్డితో పాటు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ల అధ్యక్షులు, సీనియర్ నేతలు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.
పేద విద్యార్థుల కోసం ఏర్పాటు : ఎమ్మెల్యే వివేక్
ఫీజులు చెల్లించి చదువుకోలేని పేద విద్యార్థులకు ప్రభుత్వ కళాశాలలు ఎంతగానో ఉపయోగపడుతాయని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. అనేక మంది విద్యార్థులు ఫీజులు చెల్లించి చదువుకోలేక పోతున్నారని, అందరికీ చదువు అందించాలనే ఉద్దేశ్యంతోనే సొంతంగా కోటి రూపాయలు వెచ్చించి తన తండ్రి జ్ఞాపకార్థం ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాల నిర్మించినట్లు తెలిపారు. నియోజకవర్గానికి జూనియర్, డిగ్రీ, మెడికల్ కళాశాల మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గం పరిధిలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.