సిటీబ్యూరో, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : ఢిల్లీలోని విశ్వ యువ కేంద్రంలో ‘నేషనల్ సెంటర్ ఫర్ స్కూల్ లీడర్షిప్’ ఆధ్వర్యంలో ఈ నెల 29 నుంచి 31 వరకు నిర్వహిస్తున్న జాతీయ సదస్సుకు జిల్లాలోని నెహ్రూ మెమోరియల్ ప్రభుత్వ పాఠశాలలో గణితం టీచర్గా ఉద్యోగం చేస్తున్న వుమ్మాజి పద్మప్రియ మంగళవారం పాల్గొని ప్రసంగించారు.
ఈ సదస్సుకు వివిధ రాష్ర్టాల నుంచి మొత్తం 70మందికి అవకాశం దక్కగా.. అందులో పద్మప్రియ ఒకరిగా నిలిచారు. దేశ వ్యాప్తంగా 400 కేస్ స్టడీస్, 30 పరిశోధన పత్రాలు రాగా తెలంగాణ రాష్ట్రం నుంచి తొమ్మిది మంది ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. వీరిలో పద్మప్రియ ఉండడంతో ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్ అభినందించారు.