సిటీబ్యూరో, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ)/అమీర్పేట్ : కరోనా మహమ్మారి నుంచి రక్షణ కోసం పంపిణీ చేస్తున్న దేశీయ కొవిడ్ వ్యాక్సిన్ వంద కోట్లు దాటడం ఎంతో సంతోషంగా ఉన్నదని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఇది ఒక చారిత్రక మైలురాయని ఆమె పేర్కొన్నారు. జనవరి 16 నుంచి అక్టోబర్ 21వ తేదీ మధ్య కొనసాగిన అత్యంత క్లిష్టమైన ఈ ప్రయాణంలో వైద్యులు, వైద్య సిబ్బంది అందించిన సేవలు వెలకట్టలేనివన్నారు. సనత్నగర్ ఈఎస్ఐసీ వైద్య కళాశాలను గురువారం ఆమె సందర్శించారు. వైద్య సేవలందించిన కరోనా వారియర్లను సత్కరించారు. ఈ మైలురాయిని చేరుకోవడంలో కీలక పాత్ర వహించిన ప్రధాని మోదీకి ఈ సందర్భంగా గవర్నర్ అభినందనలు తెలిపారు. దేశీయ టీకా 100 కోట్ల సంఖ్య దాటడమే కాకుండా, వందలాది దేశాలకు ఈ టీకా ఎగుమతి కావడం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమన్నారు. అపోహలు వీడి ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి సురేంద్రమోహన్, ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ పి.సౌందర రాజన్, డీన్ డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.