మెహిదీపట్నం ఆగస్టు 8: చారిత్రాత్మక గోల్కొండ కోటలోని జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో ఆషాఢ మాసం బోనాలు ఆదివారం వైభవంగా ముగిశాయి. జూలై 11న జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో ప్రారంభమైన బోనాలతో తెలంగాణ వ్యాప్తంగా ఆషాఢ మాసం బోనాలు ఊపందుకున్నాయి. ప్రతి ఆది, గురువారాల్లో జరిగిన ఎనిమిది పూజలలో నగరం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు తరలి వచ్చి అమ్మవారికి బోనాలను సమర్పించుకున్నారు. ఆదివారం చివరి పూజ కావడంతో తొమ్మిదో బోనాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. చివరి రోజు గావు, బలిగంప, ఊరేగింపులు భక్తి శ్రద్ధలతో జరిపారు. సలహాదారు సిరుగుమల్లె రాజు వస్తాద్, ఆలయ ట్రస్టు చైర్మన్ కోయల్ కార్ గోవింద్ రాజ్, ఆలయ ఈవో ఎస్.మహేందర్ కుమార్, అర్చకులు సర్వేశ్వర్ చారి, సభ్యులు స్వరూప, హేమలత, శ్రీధర్, వెంకటేష్ యాదవ్, సాయిలతో పాటు కుల వృత్తుల సంఘం అధ్యక్షులు సాయిబాబా చారి, పూజారి సురేష్ చారి తదితరులు పాల్గొన్నారు. గోల్కొండ పోలీస్ స్టేషన్ మైత్రి, పీస్ కమిటీ సభ్యులు అందించిన సేవలను ఇన్స్పెక్టర్ కొణతం చంద్రశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా అభినందించారు.