హైదరాబాద్: మానవసేవయే.. మాధవసేవగా తన సేవలను అందిస్తున్న రామకృష్ణమఠం (Ramakrishna Math) 50వ వసంతోత్సవాలను ఘనంగా జరుపనున్నారు. పశ్చిమ బెంగాల్లోని బేలూర్ మఠానికి అనుబంధంగా భారతదేశం, విదేశాలలో 166 కార్యాలయ శాఖలున్న రామకృష్ణమఠం హైదరాబాద్ నగరం దోమల్గూడలో 1973లో స్థాపించారు. 2023 డిసెంబర్ నాటికి 50 సంవత్సరాలను పూర్తి చేసుకున్న స్వర్ణోత్సవాలను(Golden Jubilee) ఘనంగా జరుపుకోవడానికి సిద్ధమయింది.
స్వర్ణోత్సవాల సందర్భంగా ఈ నెల 11 నుంచి 13 వరకు మూడు రోజుల పాటు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ( Spiritual activities) నిర్వహిస్తుంది . ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస, శారదాదేవి, స్వామి వివేకానంద ఆదర్శాలతో ప్రపంచ వేదికలపై భారతీయతను చాటుతున్న మహోన్నత సేవా సంస్థ రామకృష్ణ మఠం. మానవసేవే.. మాధవ సేవగా ఇటు ఆధ్యాత్మిక, అటు సామాజిక సేవను నలుదిశలా వ్యాప్తి చేస్తుందని నిర్వాహకులు తెలిపారు.
స్వర్ణోత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, శ్రీశ్రీ చండీ హోమం, భజనలు, మ్యూజిక్ కన్సార్ట్, బహిరంగ సభ వంటి ఆధ్యాత్మిక సంబరాల్లో పాల్గొనాలని హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు బోధ మయానంద(Bodha Mayananda) పిలుపునిచ్చారు.