వైభవంగా సుచిర్ ఇండియా ఫౌండేషన్ 30వ వార్షికోత్సవం
హాజరైన సుప్రీం కోర్టు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
రవీంద్రభారతి,ఏప్రిల్ 16 : ఉపాధ్యాయులు విద్యార్థులకు తరగతి గదిలోనే తెలుగు పద్యాలను నేర్పించి తెలుగు భాష పరిరక్షణకు కృషి చేయాలని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. సుచిర్ ఇండియా ఫౌండేషన్ 30వ వార్షికోత్సవం సందర్భంగా తెలుగు రాష్ర్టాల విద్యార్థులకు సర్ సీవీ రామన్ యంగ్ జీనియస్ అవార్డులు, గురు బ్రహ్మ అవార్డుల ప్రదానోత్సవం రవీంద్రభారతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్వీ రమణ పాల్గొని విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, గురుబ్రహ్మ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సుచిర్ ఇండియా ఆధ్వర్యంలో జాతీయ, రాష్ట్ర స్థాయి సైన్స్ టాలెంట్ సెర్చ్ పరీక్షలను నిర్వహించి విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడం అభినందనీయమన్నారు. నవభారత నిర్మాణంలో విద్యార్థులను దేశ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో సుచిర్ ఇండియా చేస్తున్న ప్రయత్నం చాలా గొప్పదన్నారు. తల్లిదండ్రులు సాధించలేని పనులను పిల్లలపై రుద్దకుండా వారి నైపుణ్యాన్ని గుర్తించి ఆయా రంగాల్లో ప్రోత్సహించాలని సూచించారు. ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు అడివి శేష్ మాట్లాడుతూ … విద్యార్థులు కష్టపడి చదివినప్పుడే ఉన్నత విఖరాలను చేరుకుంటారని తెలిపారు. అనంతరం సుచిర్ ఇండియా ఫౌండేషన్ తృష్ణ జర్నల్ను ఆవిష్కరించారు. చదువుల్లో అసాధారణ ప్రతిభ చూపిస్తున్న విద్యార్థులను గుర్తించి వారికి అవార్డులు అందిస్తున్నామని సుచిర్ ఇండియా ఫౌండేషన్ చైర్మన్ లయన్ డాక్టర్ కిరణ్ పేర్కొన్నారు.