మాదాపూర్, అక్టోబర్ 13: బిడ్డకు జన్మనివ్వడం.. తల్లికి దేవుడిచ్చిన వరమని మిసెస్ మామ్స్ డైరెక్టర్, కిమ్స్ కడల్స్ క్లినికల్ డైరెక్టర్, డాక్టర్ శిల్పిరెడ్డి అన్నారు. మహిళలు గర్భాదారణ సమయంలో అనేక సమస్యలకు లోనవుతారని, గర్భంతో ఉన్న సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు కిమ్స్ కడల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మిసెస్ మామ్స్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. కొండాపూర్లోని కిమ్స్ కడల్స్ ఆధ్వర్యంలో శిల్పిరెడ్డి ఫౌండేషన్తో కలిసి మిసెస్ మామ్స్ ౭వ సీజన్ను శుక్రవారం కిమ్స్ వైద్య బృందంతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు గర్భాదారణ సమయంలో అనేక ఒడిదుడుకులు, ఒత్తిడికి గురవుతుంటారని, తరుచు ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు అధికంగా ఉంటాయన్నారు. చాలా మందికి గర్భాదారణ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియక సతమతమవుతారని, భార్య గర్భంతో ఉన్న సమయంలో భర్త సంతోషంగా ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలన్నారు.
ఒత్తిడికి గురైనట్లయితే అనారోగ్యంతో పాటు పిల్లల ఎదుగుదలలో సమస్యలు వాటిల్లే అవకాశం ఉంటుందని తెలిపారు. గర్భిణులకు కిమ్స్ అందిస్తున్న మిసెస్ మామ్స్ మంచి వేదిక అని చెప్పారు. మన దేశంలో ముఖ్యంగా మెట్రో నగరాల్లో చాలామంది మహిళలు మధుమేహం, ఊబకాయం, పీసీఓడీ లాంటి సమస్యలతో బాధపడుతున్నారని, ఇటువంటి సమస్యలు సరైన ఆహరం తీసుకోకపోవడంతో పాటు ఎక్కువ సమయం కూర్చొని ఉండటం, ఎలాంటి వ్యాయామాలు లేకపోవడంతో వస్తాయన్నారు.
౬వ సీజన్లో ౧౩౦౬ మంది పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపారు. మిసెస్ మామ్స్ సీజన్లో భార్యతో పాటు భర్త కూడా పాల్గొనాలని చెప్పారు. ఈ సారి హైదరాబాద్తో పాటు అక్టోబర్ ౧౫న బెంగళూరు, ౨౯న చెన్నై, నవంబర్ ౫న విశాఖపట్నం, నవంబర్ ౧౯, ౨౪, ౨౫ తేదీల్లో హైదరాబాద్లో మిసెస్ మామ్స్ సీజన్కు సంబంధించిన ఆడిషన్లు జరగుతాయని, గ్రాండ్ ఫినాలె కార్యక్రమం నవంబర్ ౨౬న గచ్చిబౌలి శాంతి సరోవర్లో నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ఆరోగ్యకరమైన శిశువులకు జన్మనిచ్చేందుకు ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే గర్భంతో ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను తెలుసుకోవడంతో పాటు అపారమైన ఆత్మవిశ్వాసం కలుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.