హయత్నగర్, జూలై 5: బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఓ బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడికి యత్నించారు. ఈ ఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బుధవారం హయత్నగర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎల్బీనగర్ జోనల్ డీసీపీ సాయిశ్రీ కేసు వివరాలను వెల్లడించారు. సూర్యపేట జిల్లాకు చెందిన దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మూడేళ్ల కిందట బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి పెద్దఅంబర్పేటలో నివాసముంటున్నారు. వారి పెద్ద కుమార్తె 2021లో పదో తరగతి పూర్తి చేసింది. అనారోగ్యం వల్ల ఆమె చదువు మానేసి ఇంటి వద్దనే ఉంటుంది. తండ్రి అక్కడే వాచ్మన్గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి 9.30 గంటలకు భోజనం ముగించుకుంది. ఆ తర్వాత టాయిలెట్ కోసం బయటకు వచ్చింది.
ఇంతలోనే ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వీరి ఇంటి గేటు వద్ద బైక్ను ఆపి.. సెల్ఫోన్ మాట్లాడుతూ అడ్రస్ కోసం బాలికను అడిగారు. బాలిక గేట్ తీసి.. వారికి అడ్రస్ చెబుతూ.. వారిలో ఒకరు శ్రీకృష్ణ కిరాణా షాపు వద్దకు రెగ్యులర్గా వచ్చే అరవింద్గా గుర్తించింది. ఇద్దరు వ్యక్తులు ఆ బాలికను బెదిరించి బలవంతంగా బైక్పై ఎక్కించుకొని పెద్దఅంబర్పేటలోని ఏ-1 బేకరి వద్ద యూటర్న్ తీసుకుని నాయుడు హోటల్ వెనుకాలా ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆమెను గేటుతో ఉన్న కంపౌండ్ వాల్లోకి విసిరేశారు. అరవింద్ బాలిక మెడపై ఉన్న చున్నీని తొలగించగా.. మరో యువకుడు కాళ్లను గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేయగా.. బాధితురాలు వారి నుంచి తప్పించుకుని విజయవాడ జాతీయ రహదారిపైకి పరుగెత్తుకు వచ్చింది. అక్కడ బాధితురాలిని గమనించిన ట్రాన్స్జెండర్.. వెంటనే బాలిక తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. వెంటనే వారు అక్కడికి చేరుకుని చికిత్స నిమిత్తం బాధితురాలిని హయత్నగర్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. బాలిక ఎడమ కాలికి గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులు అరవింద్, అజయ్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.