సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : స్వచ్ఛ హైదరాబాద్ ప్రక్రియలో జీహెచ్ఎంసీ మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నది. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా చెత్తకుండీలు లేకుండా (బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా)గా మార్చింది. అప్పటి వరకు బహిరంగ ప్రదేశాల్లో ఉన్న భారీ చెత్త డబ్బాలను తీసేసి స్వచ్ఛ ఆటోల ద్వారా వందకు వంద శాతం ఇంటింటి చెత్త సేకరణకు నడుం బిగించింది. ఈ క్రమంలోనే స్వచ్ఛ ఆటోల పనితీరుపై నిరంతర నిఘా పెట్టి ఇంటింటి చెత్త సేకరణ ప్రక్రియను గాడిలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ప్రధానంగా చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దే చర్యల్లో 2500 చోట్ల తరచూ చెత్త వేసే ప్రాంతాల్లో (గార్బేజి వనరేబుల్ పాయింట్లు/జీవీపీ) డస్ట్ బిన్లు ఎత్తి వేశారు.
ఇక్కడ చెత్త వేయొద్దని, వేసే వారిపై జరిమానాలు ఉంటాయని నోటీసులు వేయడం, ఆ ప్రాంతంలో ముగ్గులు వేసి అందంగా తీర్చిదిద్దారు. అయితే ఇప్పటికీ అక్కడకక్కడ రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేస్తూ వస్తున్నారు. దీనిని కూడా పూర్తి స్థాయిలో గాడిలో పెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆస్కి (అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా) బృందం 2500 జీవీపీ పాయింట్లలో 120 బృందాలుగా ఏర్పడి, జేఎన్ఏఎఫ్ఏయూకు సంబంధించి 18 మంది పీజీ విద్యార్థులతో కలిసి క్షేత్రస్థాయిలో సర్వే జరిపారు.
వందకు వంద శాతం చెత్త సేకరణ జరిపి, జవహర్నగర్ డంపింగ్ యార్డుకు తరలించేలా సమగ్ర అధ్యయనం చేశారు. మూడు కేటగిరీలు మార్కెట్, కమర్షియల్, రెసిడెన్షియల్ ఏరియాల్లో ఏం జరుగుతోందని ఆస్కి బృందం క్షుణ్ణంగా సర్వే జరిపారు. ఈ మేరకు జీహెచ్ఎంసీకి ప్రాథమిక నివేదికను సమర్పించారు. అందులో పారిశుద్ధ్య నిర్వహణలో లోపాలు కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయని ఎత్తి చూపింది. పూర్తి స్థాయిలో స్వచ్ఛ హైదరాబాద్గా తీర్చిదిద్దడానికి పలు సూచనలు చేసింది.
సర్వేలో తేలిన కొన్ని అంశాలు…
రోజూ 6 గంటల పాటు 6 ప్రాంతాలను ఎంపిక చేసి సర్వే చేపట్టారు. ఉదయం 6 నుంచి 7 గంటలు, 10 నుంచి 11 గంటలకు, మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు, 3 నుంచి 4 గంటలు, సాయంత్రం 7 నుంచి 8 వరకు, రాత్రి 10 నుంచి 11 గంటల వరకు బృందాలు సర్వే జరిపారు. రెసిడెన్షియల్ ఏరియాలో 58శాతం మేర ఇంటింటి చెత్త సేకరణ సరిగా జరగడం లేదని తేలింది. 42 శాతం రోజూ వారీగా సక్రమంగా చెత్త సేకరణ జరుగుతుందని, 32 శాతం రోజూ విడిచి రోజూ, 8 శాతం ఇష్టారీతిన, 18 శాతం అసలే ఇంటింటి చెత్త సేకరణ లేదని తేల్చారు. కమర్షియల్ ఏరియాల్లో 60 శాతం మేర రోజూ వారీ చెత్త సేకరణ, 27 శాతం ఇష్టారీతిన చెత్త సేకరణ ప్రక్రియ జరుగుతుందని గుర్తించారు. ఇక మార్కెట్, వీధి వ్యాపారుల నుంచి 38 శాతం ట్రై సైకిళ్ల ద్వారా, 53 శాతం చెత్త సేకరణ సక్రమంగా జరగడం లేదని తేల్చారు.
100 రోజుల కార్యాచరణ ప్రణాళిక
వందకు వంద శాతం ఇంటింటి చెత్త సేకరణతో పాటు రద్దీ ప్రాంతాలైన మార్కెట్లు, బస్స్టేషన్లు, పార్కులు, వ్యాపార ప్రాంతాల్లో చెత్త కనిపించకుండా పక్కాగా పారిశుద్ధ్య నిర్వహణకు వంద రోజుల ప్రణాళికను అమలు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ రెండు రోజుల క్రితం జోనల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు డీసీలు, వైద్యాధికారులు, శానిటేషన్ సూపర్వైజర్లు, సీటీవోలు , రాంకీ ఏజెన్సీ నిర్వాహకులతో గురువారం జోన్ల వారీగా కమిషనర్లు ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. బహిరంగ చెత్త పాయింట్ల తొలగింపు, స్వచ్ఛ ఆటోల పనితీరును మరింత మెరుగు పరుచుకోవటం, ప్రజలలో స్వచ్ఛ పరిసరాలపై అవగాహన పెంచటం, రాత్రి పూట కొనసాగే హోటళ్లు, ఇతర తిను బండారాల దుకాణదారులలో చెత్త నిర్వహణపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.
ఆస్కి చేసిన సూచనలు