మున్సిపల్ కార్పొరేషన్లో 40 ట్రై బిన్స్ ఏర్పాటు
పీర్జాదిగూడ, ఎప్రిల్ 3 : పీర్జాదిగూడ నగర పాలక సంస్థను స్వచ్ఛ సర్వేక్షణ్ -2022లో ఉత్తమంగా నిలిపేందుకు మేయర్ జక్క వెంకట్రెడ్డి, పాలకవర్గ సభ్యులు , అధికారులు సమాయత్తమయ్యారు. ఇందుకు ప్రాంతాల వారీగా ప్రజలను పరిశుభ్రతలో భాగస్వాములను చేసి ముందుకు సాగుతున్నారు. కార్పొరేషన్ ఏర్పడినప్పటి నుంచి ప్రతి డివిజన్లో పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు.
పలు చోట్ల ట్రై బిన్స్ ఏర్పాటు..
స్వచ్ఛ సర్వేక్షణ్ -2022లో భాగంగా చెత్త తరలింపునకు తడి, పొడి, హానికరమైన వ్యర్థాలను వేసేందుకు ట్రై బిన్స్ను ప్రధాన రోడ్లలో, వాణిజ్య సముదాయాల వద్ద ఏర్పాటు చేశారు. ఇంతకు ముందు రోడ్లపై వ్యాపార సంస్థల వద్ద చెత్త వేయడంతో అనేక ఇబ్బందులు వస్తుండేవి. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో చెత్తను రోడ్ల పై వేయకుండా ట్రై బిన్స్ను ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ పరిధిలో 40 ట్రై బిన్స్ను వివిధ పాంతాల్లో ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ఏర్పాటు చేసిన చెత్త బిన్లను ప్రజలంతా ఉపయోగించుకుని కార్పొరేషన్కు సహకరించాలని పాలకవర్గం, అధికారులు కోరుతున్నారు.
పరిశుభ్రతకు పెద్దపీట…
ప్రభుత్వం స్వచ్ఛతకు పెద్దపీట వేస్తున్నది. మున్సిపల్ కార్పొరేషన్ను పరిశుభ్రంగా మార్చేందుకు పాలకవర్గంతో కలిసి ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నాం. తడి, పొడి, ప్రమాదకర చెత్తను వేర్వేరుగా సేకరించాలని అవగాహన కల్పించాం. కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రై బిన్స్ ఏర్పాటు చేశాం. చెత్త సేకరణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి పనిచేస్తున్నాం.
-శ్రీనివాస్ , మున్సిపల్ కార్పొరేషన్ డీఈ