బయో మైనింగ్, రేమిడేషన్ అమలుకు చర్యలు
సుమారు రూ.140కోట్లతో పనులకు జీహెచ్ఎంసీ కసరత్తు
సిటీబ్యూరో, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ ) : చెత్త శుద్ధి నిర్వహణలో ఇండోర్ తరహాలో బయో మైనింగ్, బయో రేమిడేషన్ విధానానికి జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తున్నది. చెత్త గుట్టల నుంచి దుర్వాసన రావడం, వ్యర్థాల నుంచి వెలువడే లీచెట్ సమీపంలోని చెరువులు, భూగర్భ జలాల్లో చేరి కలుషితమవుతున్నాయి. సమస్య పరిష్కార చర్యల్లో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు చెత్త కుప్పను మట్టితో కప్పి, ఆ మట్టిపై పచ్చదనాన్ని పెంపొందించే చర్యలకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. ఇందుకోసం సుమారు రూ. 140కోట్లతో పనులు చేపడుతున్నారు. తాజాగా, బయో మైనింగ్, బయో రేమిడేషన్ విధానాన్ని అమలు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు బయో మైనింగ్, బయో రేమిడేషన్ విధానం అమలుకు జీహెచ్ఎంసీ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. సమీప ప్రాంతాల ప్రజల్లో జీవన ప్రమాణాలు పెంపొందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
గ్రేటర్లో రోజూ ఉత్పత్తయ్యే చెత్త 6 వేల టన్నుల పైగానే ఉంటుంది. నలుమూలల నుంచి సేకరించిన చెత్తను జవహర్నగర్లో 339 ఎకరాల్లో విస్తరించి ఉన్న డంపింగ్ యార్డుకు తరలిస్తుంటారు. అయితే, గుట్టలు గుట్టలుగా దాదాపు 80 మీటర్ల ఎత్తున చెత్తకుప్పలు పర్వతంలా పేరుకుపోయాయి. ఈ వ్యర్థాల నుంచి గాఢ మురుగుజలం బయటకు వచ్చి సమీప ప్రాంతాల వాసులు కలుషిత నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. మరో పక్క దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా, సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ (ఎన్డబ్ల్యూ)- 2016 నిబంధనల్లో పేరుకుపోయిన చెత్త గుట్టల శాస్త్రీయ నిర్వహణకు నాలుగు మార్గాలుగా చర్యలు చేపట్టాలని భావించారు. ఈ మేరకు 2013 నుంచి చెత్త శాస్త్రీయ నిల్వ, నిర్వహణ బాధ్యతలను రాంకీ సంస్థకు అప్పగించారు. ప్రస్తుతం దుర్వాసన నివారణకు క్యాంపింగ్ పనులు జరుగుతున్నాయి.
బయో మైనింగ్, రేమిడేషన్ అంటే.?
సంవత్సరాల తరబడి పేరుకుపోయిన చెత్తను శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేయడాన్ని బయో మైనింగ్ అంటారు. తొలుత చెత్త కుప్పలను తవ్వుతారు. గాలిలోకి వ్యాపించే దుర్వాసన నివారణకు రసాయనాలు చల్లుతారు. తవ్వకం పూర్తయ్యాక చెత్తను ఆరబెడతారు. పొడిపొడిగా అయ్యాక ఆ వ్యర్థాలను యంత్రాల్లో వేసి రకరకాల పరిమాణంలో వేరు చేస్తారు. ఈ క్రమంలోనే ప్లాస్టిక్, లోహం, రాళ్లు, మట్టి వేరవుతాయి. బాగా కుళ్లి పొడిగా మారిన చెత్తను ఎరువుగా వాడుతారు. పొడి మట్టిని పొలాలు, ఇతర వ్యవసాయ అవసరాలకు ఉపయోగిస్తారు. బయో మైనింగ్తో చెత్త కుప్పల నుంచి మట్టి 35 శాతం, గాజు, రబ్బరు, లోహం, ఇతరత్రా కలిపి 5 శాతం, వస్ర్తాలు 4 శాతం, ప్లాస్టిక్ 16 శాతం, రాళ్ల వంటి గట్టి పదార్థాలు 40 శాతం మేర బయటకొస్తాయని నిపుణుల అంచనా. రేమిడేషన్లో భాగంగా వ్యర్థాలను వేరుచేసి, ప్రాసెస్ చేయడంతో పాటు సేంద్రియ ఎరువు తయారీ, ప్లాస్టిక్ వ్యర్థాల విక్రయం ద్వారా ఆదాయం పొందనున్నారు.