వరద నీరును తొలగించాలనే ఆతృత, తొందరపాటులో అవగాహనలేమితో పౌరులు చేసే చర్యలు ప్రాణాలనే బలిగొంటున్నాయి. నగరంలోని మ్యాన్హోల్స్ మానవ మృత్యుకుహరాలు కావొద్దనే ఆశయంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఓ వైపు ప్రజల్లో అవగాహన కల్పిస్తూనే.. మరో వైపు రక్షణ చర్యలు చేపట్టారు. గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న 22 వేల మ్యాన్హోల్స్కు అధికారులు సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేసి..వాటిపై రెడ్ మార్కును వేశారు. అంతేకాకుండా ‘ఇక్కడ మ్యాన్హోల్ ఉంది.. జాగ్రత్త!’ అంటూ అనేకచోట్ల సూచికలు కూడా ఏర్పాటు చేశారు. మ్యాన్హోల్స్ వద్ద సమస్యలు ఉన్నట్లయితే జలమండలి, జీహెచ్ఎంసీ హెల్ప్లైన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని అధికారులు చెబుతున్నారు. పారిశుద్ధ్య సిబ్బందే స్వయంగా వచ్చి సమస్యను పరిష్కరిస్తారని కమిషనర్ రోనాల్డ్ రోస్ చెప్పారు. అనాలోచితంగా మ్యాన్హోల్స్ మూతలు తీస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
– సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబరు 9
(నమస్తే తెలంగాణ): అనధికార వ్యక్తులు మ్యాన్హోల్స్ మూతలు తెరిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని బల్దియా, జలమండలి అధికారులు హెచ్చరిస్తున్నారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో వరద నీరు వెళ్లేందుకు ఎవరైనా పౌరులు అవగాహన లోపంతో మ్యాన్హోల్స్ మూతలు తెరిచే ప్రమాదం ఉండటంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఇందులోభాగంగానే పలు చోట్ల మ్యాన్హోల్స్పై సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేసి… వాటిపై రెడ్ మార్కును వేశారు. ఎక్కువ లోతుగా ఉన్న మురుగునీటి పారుదల వ్యవస్థలోని 22వేలకు పైగా మ్యాన్హోల్స్పై ఈ గ్రిల్స్ బిగించారు. ‘ఇక్కడ మ్యాన్హోల్ ఉంది.. జాగ్రత్త!’ అంటూ అనేకచోట్ల సూచిక బోర్డులు పెట్టారు. మ్యాన్హోల్స్ వద్ద సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక
బృందాలను మోహరించడంతో పాటు వాటికి సంబంధించిన యంత్రాలను కూడా సెక్షన్ల వారీగా ఏర్పాటు చేసినట్లు జలమండలి
అధికారులు వెల్లడించారు.
– సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ)
నగరంలోని రోడ్లపై ఉన్న మ్యాన్హోల్స్ మూతలు తెరిస్తే కఠిన చర్యలు ఉంటాయని జలమండలి అధికారులు హెచ్చరించారు. కొన్నిరోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఈ సూచనలు చేశారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జలమండలి ఇప్పటికే కొన్నిరకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. లోతైన మ్యాన్హోల్స్తో పాటు 22వేలకు పైగా మ్యాన్హోల్స్పై సేఫ్టీ గ్రిల్స్ బిగించారు. ప్రధాన రహదారుల్లో ఉన్న వాటిని కవర్స్తో సీల్ చేసి, రెడ్ మార్కు వేశారు. ఎమర్జన్సీ రెస్పాన్స్ టీం (ఈఆర్టీ) మాన్సూన్ సేఫ్టీ టీం (ఎమ్మెస్టీ), సేఫ్టీ ప్రోటోకాల్ టీం (ఎస్పీటీ) వాహనాలను రంగంలోకి దింపారు. క్షేత్రస్థాయిలో పని చేసే సిబ్బందికి రక్షణ పరికరాలు అందించారు. ఈ బృందాలకు కేటాయించిన వాహనాల్లో జనరేటర్తో కూడిన డీ వాటర్ మోటారు కూడా ఉంటుంది. దీని సాయంతో వర్షపు నీటిని తోడుతారు. వీరంతా ఆయా ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండి పని చేస్తున్నారు. అధికంగా నీరు నిలిచే ప్రాంతాలపై ఈ బృందాలు ప్రధానంగా దృష్టిసారిస్తాయి. వీటితో పాటు ఎయిర్టెక్ యంత్రాలు సైతం అందుబాటులో ఉన్నాయి. మరోవైపు మ్యాన్హోల్స్ నుంచి తీసిన వ్యర్థాలు (సిల్ట్)ని ఎప్పటికప్పుడు అక్కడి నుంచి తరలిస్తారు.
వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలోని మ్యాన్హోల్స్, క్యాచ్పిట్ కవర్లను ఎవరూ తెరవొద్దు. వరదలు వచ్చినప్పుడు రోడ్డుపై నీరు నిలిచినప్పుడు మ్యాన్హోల్స్ మూతలు తెరిచి ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అనధికార వ్యక్తులు మ్యాన్హోల్స్ మూతలను ఓపెన్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. వరద నీటి సమస్యలు ఉంటే జీహెచ్ఎంసీ హెల్ప్లైన్ నంబర్ 040 – 2111 1111కు సమాచారం ఇవ్వాలి. వెంటనే జీహెచ్ఎంసీ సిబ్బంది మ్యాన్హోల్స్, క్యాచ్పిట్స్ మూతలు ఓపెన్ చేసి, సమస్యను పరిష్కరించి, వెంటనే మూసి వేస్తారు.
– జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్
మ్యాన్హోళ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రతి సెక్షన్ నుంచి సివర్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ఒక సీవరేజీ బృందం ఏర్పాటు చేశారు. ఈ బృందం ఉదయాన్నే క్షేత్రస్థాయిలో తమ పరిధిలోని ప్రాంతాలకు వెళ్లి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నది.
ఎవరైనా పౌరులు, అనధికార వ్యక్తులు అధికారుల అనుమతి లేకుండా మ్యాన్హోల్స్పై ఉన్న మూత తెరిచినా.. తొలగించినా HMWSSB ACT – 1989, SECTION-74 ప్రకారం నేరం. దీనిని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. అలాంటి వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. నిందితులకు జరిమానా విధించడంతో పాటు కొన్నిసార్లు జైలుశిక్ష కూడా పడే అవకాశముంటుంది.
పారిశుధ్య కార్మికులు, సిబ్బంది విధులు నిర్వహించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర సమయాల్లో ఎలా పని చేయాలనే విషయంపై వారికి జలమండలి ఏటా భద్రతా వారోత్సవాలు, పక్షోత్సవాలు నిర్వహిస్తున్నది. కార్యక్రమంలో భాగంగా కార్మికులకు ఎస్వోపీ మార్గదర్శకాల ప్రకారం భద్రతా పరికరాల పనితీరు, ఉపయోగించిన విధానం, పారిశుధ్య పనుల్లో తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలపై శిక్షణ ఇచ్చారు. అంతేకాకుండా పని ప్రదేశాల్లో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు చేయాల్సిన ప్రథమ చికిత్సపైనా అవగాహన కల్పించారు.
వర్షాకాలంలో మురుగు నీటి వ్యవస్థ నిర్వహణలో సాధారణ పౌరులు ఎలా ప్రవర్తించాలి? ఎలా నడుచుకోవాలనే అంశాలపై జలమండలి విస్తృతంగా ప్రచారం చేస్తుంది. స్థానిక కాలనీ సంఘాలు, ఎస్హెచ్ గ్రూపుల సభ్యులతో ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. చేయాల్సిన.. చేయకూడని పనులపై దినపత్రికలు, టెలివిజన్, ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సామాజిక మాద్యమాల్లో కూడా విస్తృతంగా అవగాహన కల్పిస్తుంది.
ఎక్కడైనా మ్యాన్హోల్ మూత ధ్వంసమైనా, తెరిచి ఉంచినట్లు గుర్తించినా లేదా ఇతర సమస్యలు, ఫిర్యాదులు ఉంటే జలమండలి కస్టమర్ కేర్ నంబర్ 155313కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి. దగ్గరలోని వార్డు కార్యాలయాల్లోనూ నేరుగా సంప్రదించవచ్చు.
నగరంలో నీరు నిల్వకుండా తగిన చర్యలు తీసుకోవాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను అప్రమత్తం చేశారు. ఇష్టానుసారంగా ప్రైవేటు వ్యక్తులు మ్యాన్ హోల్స్ మూతలు తెరిచి వదిలేస్తున్నారని చెప్పారు. దీని వల్ల పౌరుల ప్రాణాలకు హాని కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మ్యాన్ హోల్స్ మూతలు తెరిచే బాధ్యత జీహెచ్ఎంసీ సిబ్బంది పర్యవేక్షిస్తుందని చెప్పారు. నగరంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మేయర్ శనివారం జోనల్ కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అయోధ్యనగర్, బల్కంపేట, మయూరీ మార్గ్, చందానగర్, నాగోల్, చార్మినార్ తదితర నీటి నిల్వ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. వరద నీటి సమస్యలు ఉంటే జీహెచ్ఎంసీ హెల్ప్లైన్ నంబర్-04021111111ను సంప్రదించాలని నగరవాసులకు మేయర్ సూచించారు. ఈ కాన్ఫరెన్స్లో కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమతా, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ వెంకటేశ్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజ, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు