సిటీబ్యూరో, ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ) /సైదాబాద్ : స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అధికారులను జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ అదేశించారు. గురువారం ఉన్నతాధికారులతో కలిసి నగరంలో పలు ప్రాంతాలలో పర్యటించారు. తొలుత అంబర్పేట ఫ్లై ఓవర్ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల కోసం పెండింగ్లో ఉన్న ఆస్తుల సేకరణ వివరాలను సంబంధిత అధికారుల నుంచి కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, అప్రోచ్ రోడ్డులో ట్రాఫిక్ అంతరాయం కలిగించే అపార్ట్మెంట్స్ ముందు భాగాన్ని రోడ్డు వైపున స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలైన్మెంట్ ప్రకారం ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని సూచించారు.
క్యాదిరి బాగ్ వద్ద మసీదు పక్కనే ఉన్న చిన్న భాగాన్ని స్వాధీనం చేసుకోవాలని కమిషనర్ చెప్పారు. అంబర్పేట మహంకాళి ఆలయం పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ను ఇతర చోటికి మార్చాలని, గాంధీ విగ్రహం ఎదురుగా ఉన్న సర్వీస్ రోడ్డుకు అడ్డంగా ఉన్న చిన్న నిర్మాణాలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచి మలక్పేట్ నుంచి ఐఎస్ సదన్ వరకు ఫ్లై ఓవర్ పనుల పురోగతిని జోనల్ కమిషనర్ టి.వెంకన్నతో సమీక్షించారు. చంచల్గూడ ప్రెస్రోడ్, సైదాబాద్ ప్రాంతాన్ని సందర్శించి ఫ్లై ఓవర్ పనులను వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ దేవానంద్ తదితరులు పాల్గొన్నారు. సైదాబాద్ పురాతన హనుమాన్ దేవాలయం మీదుగా చేపట్టిన స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనుల ఆలైన్మెంట్ మార్చాలని బీజేపీ నాయకులు సహదేవ్యాదవ్, కొత్తకాపు రవీందర్రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, వినయ్కిశోర్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.