సిటీబ్యూరో, జనవరి 4 (నమస్తే తెలంగాణ) : అనేక సమస్యలకు పరిష్కార వేదికగా నిలిచే ప్రజావాణి కార్యక్రమాన్ని ఎట్టకేలకు అమలు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ నిర్ణయించారు. ప్రతి సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయాల్లోనూ నిర్వహించాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ నెల 8 నుంచి తొలుత 30 సర్కిళ్లతో పాటు ఆరు జోనల్ కార్యాలయాల్లో ప్రజావాణి అమలు చేయనున్నారు.
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ రొనాల్డ్ రాస్ వేర్వేరు చోట్ల ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి తర్వాత 22వ తేదీ నుంచి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనూ ప్రజావాణి నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా 2020 సంవత్సరం కరోనా సమయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిలిపివేశారు. వార్డు కార్యాలయాలు, కాల్సెంటర్ 040-2111 1111ల ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరిస్తున్నారు. అయితే ప్రభుత్వ సెలవు రోజున ప్రజావాణి ఉండదని అధికారులు పేర్కొన్నారు.
ఈ నెల 8వ తేదీన నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం జోన్, సర్కిల్ కార్యాలయాల్లో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రధాన కార్యాలయంలో 22వ తేదీ నుంచి ప్రజావాణి నిర్వహిస్తామని, ప్రధాన కార్యాలయానికి రాలేని వారి కోసం ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటల వరకు ఫోన్ ఇన్ ప్రోగ్రాం ఉంటుందని అన్నారు. దాని కోసం ఫోన్ నంబర్ను త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు. తదనంతరం ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఫిర్యాదులు స్వీకరిస్తామని కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ రొనాల్డ్ రాస్ సూచించారు.