సిటీబ్యూరో/మియాపూర్, జనవరి 31 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో దశల వారీగా తరచూ చెత్త వేసే ప్రాంతాలను తొలగించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ అధికారులను ఆదేశించారు. శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని యూసుఫ్గూడ, శేరిలింగంపల్లి, చందానగర్, రామచంద్రాపూర్, పటాన్చెరూ సర్కిళ్లలో పారిశుధ్య పనులపై కమిషనర్ బుధవారం అధికారులతో కలిసి సమీక్షించారు.
ఇంటింటి నుంచి సేకరించిన వ్యర్థాలను సమీప సెకండరీ ట్రాన్స్ఫర్ పాయింట్లకు తరలించడం, ప్రతి సర్కిల్లో తిరుగుతున్న వాహనాల సంఖ్య, సీ అండ్ డీ మెటీరియల్ లిఫ్ట్, ఎస్ఎఫ్ఏ సంఖ్య తదితర వివరాలను కమిషనర్ అడిగి తెలుసుకున్నారు.
గేటెడ్ కమ్యూనిటీల్లో చెత్తను సేకరించేందుకు వీలుగా డస్ట్ బిన్ ఏర్పాటు చేయాలని, వినియోగంలో లేని పబ్లిక్ టాయిలెట్లను తొలగించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. అంతకు ముందు కమిషనర్ దుర్గం, చుట్టుపక్కల ఉన్న సరిహద్దు గోడ, నడక మార్గం మొదలైన ఇంజినీరింగ్, పారిశుధ్య పనులను పరిశీలించారు. జోనల్ కమిషనర్ స్నేహ శబరీష్, శానిటేషన్ విభాగం అదనపు కమిషనర్ ఉపేందర్రెడ్డి పాల్గొన్నారు.